
ప్రజల సంక్షేమం, పార్టీ ముఖ్యం
ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
మునుగోడు : రాష్ట్ర ప్రజల సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధే తనకు ముఖ్యమని, తాను ఏ రోజూ పదవుల కోసం పాకులాడలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. కొంతకాలంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి వస్తుందని భావించగా ఇటీవల ప్రభుత్వం ముగ్గురికి మంత్రి పదవులకు ఎంపిక చేసింది. కానీ రాజగోపాల్రెడ్డికి పదవి దక్కలేదు. దీంతో ఆయన రెండు రోజుల పాటు ఎవ్వరితోనూ టచ్లో లేకుండా తన ఫాం హౌస్లో విశ్రాంతి తీసుకున్నారు. మంత్రి పదవిపై ఏవిధంగా స్పందిస్తారని అందరూ ఉత్కంఠతో చూశారు. అయితే బుధవారం తన మనస్సులో మాటను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. నూతనంగా మంత్రి పదవులు పొందిన ముగ్గురికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తనకు పదవి రాలేదని ఎక్కడా బాధపడడం లేదని, పదవి ఉన్నా లేకనపొయినా ప్రజల కోసం పనిచేనని.. అదే తనకు ఎంతో శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు. జీవితాంతం రాజకీయాల్లో ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.
మెరుగైన వైద్యసేవలందించాలి
భువనగిరి : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ మనోహర్ పేర్కొన్నారు. బుధవారం భువనగిరి మండలంలోని అనంతారంలో గల అయుష్మాన్ అరోగ్య మందిర్ను సందర్శించారు. కాయకల్ప సేవల గురించి తెలుసుకున్నారు. ఉత్తమ వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఏర్పాటు చేసిందన్నారు. సకాలంలో విధులకు హాజరై సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ శిల్పిని, కమ్యూనిటీహెల్త్ ఆఫీసర్ జ్ఞానేశ్వర్, రమేష్నాయక్, సురేష్కుమార్, వసుద, రమాదేవి, లింగలక్ష్మి, శోభ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచాలి
భువనగిరిటౌన్ : ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఎస్సీ సంక్షేమాధికారి శ్యాంసుందర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో సహాయ షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి, వసతి గృహాల సంక్షేమ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వసతి గృహాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన భోజనం గురించి తల్లిదండ్రులకు వివరించాలని కోరారు. ఉపకార వేతనాల కోసం పాఠశాలల నుంచి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు స్వీకరించాలని ఆదేశించారు. అదే విధంగా ఆత్మకూర్ (ఎం), మోటకొండూర్లో హాస్టళ్లను సందర్శించారు.