పోచంపల్లి ఇక్కత్‌కు ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

పోచంపల్లి ఇక్కత్‌కు ఉజ్వల భవిష్యత్‌

Jun 13 2025 4:36 AM | Updated on Jun 13 2025 4:36 AM

పోచంప

పోచంపల్లి ఇక్కత్‌కు ఉజ్వల భవిష్యత్‌

భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్‌కు ఉజ్వల భవిష్యత్‌ ఉంది.. కాటన్‌, సెమికాటన్‌, సిల్క్‌తో అనేక వైరెటీలలో ఇక్కత్‌ వస్త్రాలు తయారు చేయడం గొప్ప విషయమని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ కొనియాడారు. గురువారం ఆయన తన సతీమణి సుధా డెబ్బార్మతో కలిసి భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. టూరిజం పార్కులోని చేనేత కాన్ఫరెన్స్‌ హాలులో చేనేత కార్మికులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో నిర్వహించిన సమావేశంలో గవర్నర్‌ మాట్లాడారు. ప్రపంచంతో పాటు దేశంలో ఏ మూలకుపోయినా పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలను ధరిస్తున్నారని అభినందించారు. పోచంపల్లి ఇక్కత్‌, కంచి, ఒడిశా తదితర చేనేత వస్త్రాలలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో గుర్తింపు ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్‌ కల్చర్‌ ఎక్చేంజ్‌లో చేనేతవస్త్రాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నారు.

పోచంపల్లికి మళ్లీ వస్తా

దేనికై తే పేరుంటుందో దానికి నకిలీల బెడద ఉంటుందని, దాంతోనే పోచంపల్లి ఇక్కత్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్పదనం అర్థమవుతుందని గవర్నర్‌ పేర్కొన్నారు. ప్రింట్‌ఫొటోకు, పెయింటింగ్‌ ఫొటోకు తేడా ఉన్నట్లే మిల్లులో తయారైన వస్త్రానికి, మగ్గంపైన తయారైన వస్త్రానికి ఉన్న తేడా, నాణ్యతను ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఎప్పుడైనా చేనేత వస్త్రాలను మిల్లులో తయారైన వస్త్రంతో పోల్చుకోవద్దని సూచించారు. ప్రస్తుతం మార్కెటింగ్‌, డుప్లికేషన్‌ పెద్ద సమస్యగా మారిందన్నారు. పోచంపల్లి ఇక్కత్‌ పేరు విన్నానని, అలాగే పుస్తకాల్లో చదివానే తప్ప.. వస్త్రాలు ఎలా తయారవుతాయో తనకు తెలియదన్నారు. పోచంపల్లికి వచ్చి ప్రత్యక్షంగా ఇక్కత్‌ వస్త్రాల తయారీని చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పోచంపల్లికి మళ్లీ వస్తానన్నారు.

జూనియర్‌ కాలేజీకి

కంప్యూటర్‌ ల్యాబ్‌ మంజూరు

చేనేత నాయకుడు తడక వెంకటేశం ఇచ్చిన వినతి మేరకు గవర్నర్‌ స్పందిస్తూ పోచంపల్లి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి కంప్యూటర్‌ ల్యాబ్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే ల్యాబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాఽధికారులను ఆదేశించారు. చేనేత కార్మికులు గర్దాస్‌ ఉపేందర్‌, కుంట్లగూడెంకు చెందిన భాగ్యలక్ష్మి, వనం యాదగిరికు నేతన్న బీమా, కూర పాటి నిర్మల, పొట్టబత్తిని సుగుణ, దోర్నాల ధనుంజయ్యకు త్రిఫ్ట్‌ ఫండ్‌ చెక్కులను అందజేశారు.

చేనేతకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే కుంభం

చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రాధా న్యమిస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. త్రిప్ట్‌ పథకం, వయస్సుతో నిమిత్తం లేకుండా వృత్తిపై ఆధారపడిన చేనేత కార్మికులకు నేతన్న బీమా పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. నేతన్నకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు.

మహిళా కార్మికుల సేవలు బేష్‌ : కలెక్టర్‌

పురుషులతో సమానంగా మహిళా కార్మికులు చేనేత పనిచేసి కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారని కలెక్టర్‌ అన్నారు. నేతన్నలకు టెక్నాలజీ ఉపయోగించి ఉపాధి కల్పించాలని గవర్నర్‌ ఆలోచన చేస్తున్నారని, ఎన్‌ఐటీతో మాట్లాడి అధ్యయనం చే యాలని కోరారని తెలిపారు.గవర్నర్‌ ఆలోచన స త్ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫ ప్రపంచం, దేశంలో ఏ మూలకెళ్లినా ఇక్కత్‌ వస్త్రాలు ధరిస్తున్నారు

ఫ చేనేత డిజైన్ల అభివృద్ధి, ఉపాధి కల్పనకు సహకరిస్తా

ఫ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ

ఫ సతీమణితో కలిసి భూదాన్‌పోచంపల్లి సందర్శన

చేనేత గృహాలకెళ్లి.. కుటుంబాల జీవన స్థితిగతులపై ఆరా తీసి..

గవర్నర్‌ పోచంపల్లి పర్యటనలో భాగంగా తొలుత చేనేత కార్మికులు పెండెం కృష్ణ, భారత మధు, భారత భాస్కర్‌ ఇళ్లను సందర్శించారు. వారు గవర్నర్‌ దంపతులకు బొట్టుపెట్టి ఇంట్లోకి స్వాగతం పలికారు. ఎన్నేళ్ల నుంచి చేనేత వృత్తి చేస్తున్నారు, ఎంత గిట్టుబాటు అవుతుందని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టూరిజం పార్కులోని మ్యూజి యంను సందర్శించారు. కొకూన్స్‌, నూలు, నూలువడకడం, చిటికికట్టడం, ఆసుపోయడం, రంగులద్దకం, మగ్గాలపై వస్త్ర తయారీ ప్రక్రియలన్నింటినీ నిశితంగా పరిశీలించారు. అలాగే పోచంపల్లి ఇక్కత్‌, తేలియా చేనేత వస్త్రాలను పరిశీలించారు. చేనేతకళాకారుల నైపుణ్యాలను కొనియాడారు. గవర్నర్‌ స్వయంగా మగ్గం నేసి అబ్బురపర్చారు. అనంతరం పోచంపల్లి చేనేత ప్రాముఖ్య ఏవీని తిలకించారు. కార్యక్రమంలో చేనేత, జౌళిశాఖ ప్రిన్సి పల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, కలెక్టర్‌ హనుమంతరావు, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, చేనేత జౌళిశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, జాయింట్‌ డైరెక్టర్లు వెంకటేశ్వర్‌రావు, ఇందుమతి, ఆర్‌డీడీ పద్మ, డీసీపీ అక్షాంశ్‌యాదవ్‌, ఏడీ శ్రీనివాసరావు, ఏడీఎం కళింగరెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్థన్‌, గజం అంజయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేఖాబాబు రావు, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ అంజన్‌రెడ్డి, ఏసీపీ మధుసూధన్‌రెడ్డి, చేనేతనాయకులు తడక వెంకటేశం, తడక రమేశ్‌, భారత లవకుమార్‌, ఎన్నం శివకుమార్‌, అంకం పాండు, మెరుగు శశికళ, గుర్రం హేమలత, హరిశంకర్‌, కాంగ్రెస్‌ నాయకులు పాక మల్లేశ్‌, సామ మధుసూధన్‌రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

పోచంపల్లి ఇక్కత్‌కు ఉజ్వల భవిష్యత్‌ 1
1/1

పోచంపల్లి ఇక్కత్‌కు ఉజ్వల భవిష్యత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement