
యాటను తెస్తా.. బహుమతి ఇస్తా
ఆలేరు: ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసిన వారికి గృహప్రవేశానికి యాటను తీసుకొస్తా.. సెపరేట్ బహుమతి ఇస్తా అని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బంపర్ ఆఫర్ ఇచ్చారు. మంగళవారం ఆలేరు పట్టణంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ బంపర్ ఆఫర్ను ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వారికి అవసరమైన ఆర్థిక సాయం అందజేస్తానని ఎమ్మెల్యే మరో ఆఫర్ ఇచ్చారు.
పలువురి నిరసన
ఈ సందర్భంగా అర్హత ఉన్న తమ కుటుంబానికి ఇళ్లు మంజూరు కాలేదని సాయిగూడెం గ్రామానికి చెందిన మక్బుల్ తదితరులు ఎమ్మెల్యే వెళ్లిన తరువాత సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ నేతల అనుయాయులకు ఇళ్లు వచ్చాయని మున్సిపాలిటీకి చెందిన పలు వార్డుల మహిళలు బాధపడుతూ నిరాశతో వెనుదిరిగారు. కౌంటర్ల వద్ద ఇళ్లు మంజూరు పత్రాల అందజేసే క్రమంలో కాసేపు గందగోళం నెలకొంది. ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ వేదిక మీద అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కూర్చొవడం గమనార్హం. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి గోపాల్, ఆలేరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ, సత్యాంజనేయప్రసాద్, ఎంపీఓ అనురాధ, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది టీపీసీసీ నేత జనగాం ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు
ప్రభుత్వ విప్ ఐలయ్య బంపర్ ఆఫర్