
‘వ్యవసాయ పాలిటెక్నిక్’లో ప్రవేశాలు
త్రిపురారం: అగ్రికల్చర్ డిప్లొమా చేయాలనుకునే విద్యార్థుల కోసం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా త్రిపురారం మండలం కంపాసాగర్లో గల వ్యవసాయ పరిశోధనా స్థానంలో పాలిటెక్నిక్ కళాశాలను 2007లో ప్రారంభించారు. పదో తరగతి ఉత్తీర్ణులై, అగ్రికల్చర్ విభాగంలో పాలిసెట్–2025లో ర్యాంకు సాధించిన విద్యార్థులు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరేందుకు గాను ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు :
దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 2024 డిసెంబర్ 31 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 22 ఏళ్లు. పదో తరగతిలో వచ్చిన మార్కులు, పాలిసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంపిక ఉంటుంది. రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. అర్హత సాధించిన వారికి మాత్రమే సమాచారం అందిస్తారు. వివరాలకు www.pjtsau. edu.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల వ్యవధి రెండేళ్లు కాగా.. డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సు వ్యవధి మూడేళ్లు ఉంటుంది. కంపాసాగర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
● దరఖాస్తు ఫీజు : దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, ఇతర అభ్యర్థులకు రూ.1200,
● ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపునకు
చివరి తేదీ : జూన్ 28
● ఆన్లైన్ దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ : జూన్ 29
● దరఖాస్తులు తప్పుల సవరణకు
చివరి తేదీ : జూన్ 30
ఆన్లైన్లో దరఖాస్తునకు ఈ నెల
29 వరకు గడువు
పదో తరగతి మార్కులు, పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా ఎంపిక
యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఎంపిక
విద్యార్థుల ఎంపిక యూనివర్సిటీ పరిధిలో ఉంటుంది. కంపాసాగర్ పాటిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు ప్రశాతం వాతావరణంలో విద్యా బోధన ఉంటుంది. విద్యార్థులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి వ్యవసాయంలో పాటించాల్సిన పద్ధతులపై క్షేత్రస్థాయిలో మెళకువలు నేర్చుకుంటారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
– డాక్టర్ లింగయ్య, ప్రధాన శాస్త్రవేత్త,
కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం