
కుక్కల దాడిలో కృష్ణ జింక మృతి
గట్టుప్పల్: కుక్కల దాడిలో కృష్ణ జింక మృతిచెందింది. ఈ ఘటన గట్టుప్పల్ మండల పరిధిలోని నామాపురం గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నామాపురం గ్రామ శివారులోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రం సమీపంలో గడ్డి మేస్తున్న కృష్ణ జింకను కుక్కలు వెంటాడి చంపాయి. సమీపంలోని రైతులు గమనించి కృష్ణ జింకను విడిపించే ప్రయత్నం చేయగా.. కుక్కలు రైతుల వెంటపడడంతో వారు తప్పించుకున్నారు. అటవీశాఖ అధికారులు ప్రభుత్వ భూమిని గుర్తించి జింకల పార్కు ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ కంచుకట్ల సంపత్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్ కంచుకట్ల సుభాష్, భీమనపల్లి రాములు డిమాండ్ చేస్తున్నారు.
బాలుడికి గాయాలు..
నేరేడుచర్ల: కుక్కల దాడిలో బాలుడు గాయపడిన ఘటన సోమవారం నేరేడుచర్ల మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన రావిరాల మన్విత్ బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి నేరేడుచర్ల మున్సిపాలిటీలోని చింతబండకు వచ్చాడు. బంధువుల ఇంటి వద్ద పిల్లలతో కలిసి మన్విత్ ఆడుకుంటుండగా.. కుక్కలు ఒక్కసారిగా అతడిపై దాడి చేయడంతో కాలుకు తీవ్ర గాయమైంది. వెంటనే మన్విత్ను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పీహెచ్సీ వైద్యాధికారి పున్న నాగిని తెలిపారు.
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
వలిగొండ: రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన వలిగొండ మండలం ముద్దాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముద్దాపురం గ్రామానికి చెందిన సోలిపురం నర్సిరెడ్డి(55) ఆదివారం సాయంత్రం తన ఇంటి నుంచి వ్యవసాయ బావి వద్దకు తొర్రూరు–వలిగొండ రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుంచి అతివేగంగా లారీ వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న నర్సిరెడ్డి కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతడిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. సోమవారం మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు.

కుక్కల దాడిలో కృష్ణ జింక మృతి