ఏటీఎం పగులగొట్టిన వ్యక్తి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఏటీఎం పగులగొట్టిన వ్యక్తి అరెస్టు

Apr 28 2026 8:46 AM | Updated on Apr 28 2026 8:46 AM

కై కలూరు: మద్యం మత్తులో ఏటీఎం పగులగొట్టి దొంగతనానికి యత్నించిన వ్యక్తిని కై కలూరు టౌన్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. టౌన్‌ సీఐ ఏవీఎస్‌.రామకృష్ణ, ఎస్సై డి.వెంకట్‌కుమార్‌ పోలీసు స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. కై కలూరు మండలం భుబలపట్నంలో వెల్పూరి నాగరాజు రొయ్యల చెరువుపై పనిచేయడానికి అల్లూరి సీతారామరాజు జిల్లా, పెదబయలు మండలం, గుల్లేలా పంచాయతీకి చెందిన వందలం నాగరాజు దాదాపు 3 నెలల క్రితం పనిలో చేరాడు. పని విషయంలో యజమాని తిట్టడంతో ఇంటికి వెళ్లిపోతానని చెప్పారు. ఈ నేపధ్యంలో యజమాని ఈనెల 24న కై కలూరు రైల్వేస్టేషన్‌లో వందలం నాగరాజును దించాడు. అతడు తెల్లవారుజామున 3 గంటలకు మద్యం మత్తులో కేడీసీసీ ఏటీఎంలో డబ్బులు కోసం వచ్చాడు. ఏటీఎం కార్డు బదులు ఆధార్‌ కార్డును మిషన్‌ శ్లాట్‌లో పెట్టాడు. అది రాలేదు. దీంతో అప్పటికే పగిలి ఉన్న కీబోర్డును గట్టిగా కొట్టడంతో ఊడి వచ్చింది. దీంతో చేతిని గట్టిగా లోపలకి దూర్చి కార్డు కోసం ప్రయత్నించాడు. అదే సమయంలో డబ్బులు ఉంటే తీసుకోడానికి సిద్ధమయ్యాడు. చివరకు అతని వల్ల కాక పారిపోయాడు. దీనిపై బ్యాంకు మేనేజర్‌ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement