ఆకివీడు: పట్టణంలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో గురువారం అతివేగంగా వచ్చిన కారు ట్రాక్టర్ను ఓవర్ టేక్ చేస్తూ కరెంట్ స్తంభం, గోడను ఢీకొట్టింది. సంఘటనలో ఎవరికీ గాయాలు అవ్వలేదు. స్థానిక శాంతి నగర్ వైపు నుంచి ఇద్దరు మైనర్లు మధ్యాహ్న సమయంలో అతి వేగంగా కారును నడుపుతూ ట్రాక్టర్ను తప్పించబోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, దాని వెనుకనే ఉన్న గోడను ఢీకొట్టారు. ప్రమాదంలో విద్యుత్ స్తంభం ముక్కలై వైర్లు తెగిపడ్డాయి. మంటలు వచ్చి సరఫరా నిలిచిపోయింది. గోడ ధ్వంసమైంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. మధ్యాహ్నం కావడంతో ఆ ప్రాంతంలో జనసంచారం, పాఠశాల విద్యార్థులు బయటకు రాలేదు. లేకుంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభం ధ్వంసమైన సంఘటనపై స్తంభం పునరుద్ధరణ, లైన్లు ఏర్పాటు వంటి వాటికి రూ. 25,600 ఎస్టిమేట్ వేశామని, సంబంధిత కారు యజమాని వద్ద వసూలు చేస్తామని ట్రాన్స్కో ఏఈ రత్నాకర్ చెప్పారు.


