కై కలూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపలు, రొయ్యల రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బి.బలరాం డిమాండ్ చేశారు. కై కలూరు ఎన్జీవోస్ కాలనీలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, ఆక్వా రైతు బొడ్డు నోబుల్ నివాసం వద్ద ఆక్వారంగ ప్రస్తుత పరిస్థితులపై సమావేశం బుధవారం నిర్వహించారు. బలరాం మాట్లాడుతూ ట్రంప్ సుంకాలు, యుద్ధంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రస్తుతం ఆక్వా ఉత్పత్తులకు స్థిరమైన, నిలకడైన ధరలు లేకపోవడంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఆక్వా రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఆక్వా ఫీడ్కు సంబంధించిన సోయాబీన్ ముడి సరుకుల ధరలు తగ్గినా ఫీడ్ ధరలు తగ్గించకపోవడం అన్యాయమన్నారు. ఫీడ్ ధరలు తగ్గించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. విద్యుత్ సబ్సిడీ రైతులందరికీ వర్తింపజేయాలని, పెంచిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ధరలు తగ్గించాలన్నారు. ఆక్వారంగాన్ని వ్యవసాయ రంగంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతుల సమస్యలపై జూన్ 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.


