ఉండి: ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వలన వర్షాలు తక్కువగా కురిసి నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, ఆక్వారైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని మార్టేరు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీ సహదేవరెడ్డి సూచించారు. గత కొద్దిరోజులుగా ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రంలో రొయ్యల పెంపకంలో మెరుగైన యాజమాన్యాలపై నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమం సోమవారంతో ముగిసింది. మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సహదేవరెడ్డి మాట్లాడుతూ రైతులంతా నీటి వృథాను అరికట్టేలా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆక్వారైతులు తమ చెరువుగట్లపై మొక్కలను పెంచి చల్లని వాతావరణాన్ని ప్రేరేపించడం ద్వారా వాతావరణంలో వేడి తగ్గించి సుస్థిర ఉత్పత్తిని సాధించవచ్చునని అన్నారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్న సాంకేతికతను చెరువుల యాజమాన్యంలో ఉపయోగించి ఖర్చు తగ్గించుకుని ఉత్పత్తిని పెంచుకోవాలని సూచించారు. ప్రోగ్రాం కన్వీనర్ శ్రీనివాస్ చివరిరోజు శిక్షణలో భాగంగా రొయ్యల్లో వ్యాధుల యాజమాన్యం, ఆర్ఏఎస్ పద్ధతి ద్వారా రొయ్యల పెంపకం, ఆక్వాఫోనీక్స్ విధానం, బయో ఫాలక్ పెంపకం తదితర విషయాలను వివరించారు. ఎంపెడా సాంకేతిక నిపుణుడు దుర్గారావు రొయ్యల ఎగుమతులు, దిగుమతులు, రొయ్యల చెరువుల రిజిస్ట్రేషన్ తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు ఏ శ్రీనివాస్, వినయలక్ష్మి, బిందు ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.


