ఏలూరు టౌన్ : రాష్ట్రంలో కూటమి పాలనలో దళితులపై రోజురోజుకూ అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయని, ఆకివీడు పెదపేటలో శ్రీరామనవమి వేడుకల పేరుతో అక్కడకు వెళ్ళి రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పి.. మత, కుల విద్వేషాలు రెచ్చగొట్టడం దారుణమని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు అన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పెదపేటలో రామాలయం కట్టాలని భావిస్తే గ్రామపెద్దలతో సామరస్యంగా చర్చించి ఇరు పక్షాలకూ ఇబ్బంది లేకుండా చేయాలని, కుట్రపూరితంగా గ్రామంలోకి రాజకీయ నేతలతో, పోలీస్ బలగాలతో వెళ్ళి దళితులను అణచివేయాలనే ప్రయత్నం సరైంది కాదన్నారు. ఉప సభాపతి స్థానంలో ఉంటూ కావాలనే మతపరమైన చిచ్చు రేపేందుకు గత కొంతకాలంగా అక్కడికి వెళుతూ దళితుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. మందీ మార్బలంతో పెదపేటలోకి వెళ్ళి గొడవలు సృష్టించారు.. ఒక వర్గం నేతలు నినాదాలు చేస్తూ దళితులను రెచ్చగొట్టారు.. ఇది నిజం కాదా అంటూ వారు ప్రశ్నించారు. 57 మంది దళిత యువకులు, మైనర్లపై అక్రమ కేసులు బనాయించి వారి భవిష్యత్తో చెలగాటం ఆడాలని చూస్తే సహించేది లేదన్నారు. ఎస్సీ సెల్ అధికార ప్రతినిథి మున్నుల జాన్గురునాథ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నిట్టా గంగరాజు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో దళితులకు రాష్ట్రంలో ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉన్నత పదవుల్లో ఉన్న నేతలు సైతం దళితులను అణచివేసే ధోరణిలో మాట్లాడుతూ పెదపేట వివాదానికి మతం రంగు పులిమే ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఏలూరు నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, ఏలూరు నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రత్తిపాటి విక్టర్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ఆగ్రహం


