కుక్కునూరు: మండలంలో అటవీ శాఖ పనితీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర అటవీ శాఖ పరిధిలోని బాంబూ చెట్లను తెలంగాణ అటవీశాఖ సిబ్బంది తమ ప్రాంతంలోదని పేర్కొంటూ అమరవరం రేంజ్ పరిధిలోని, కొత్తూరు బీట్ అటవీ ప్రాంతంలో సుమారుగా 20,000 కర్రలను నరికినట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలిసి కూడా అమరవరం రేంజ్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అటవీ శాఖలో అక్రమ వసూళ్లు
కొయ్యలగూడెం: అటవీ శాఖలో అక్రమ వసూళ్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కన్నాపురం అటవీ శాఖ రేంజ్ పరిధిలో పుల్ల ట్రాక్టర్ల నుంచి వసూళ్లు చేస్తున్నారని రైతులు ఆరోపణలు చేస్తున్నారు. మామిడి, జీడిమామిడి పుల్ల ట్రాక్టర్కు రూ. 4 వేల నుంచి రూ.6 వేలు, ఇతర మారుజాతి పుల్ల ట్రాక్టర్కు రూ.10 వేల వరకు వసూలు చేసుకున్నారని అంటున్నారు. బేరన్ క్యూరింగ్ కోసం మామిడి, జీడి మామిడి తోటలను పొలాలలో నుంచి తీసి వేస్తున్న రైతుల నుంచి పుల్లను కొనుగోలు చేసి తమ అవసరాల కోసం తరలిస్తుంటే అడ్డుపడి వసూళ్లు చేస్తున్నారంటున్నారు. దీనిపై కార్యాలయంలోని ఓ అధికారిని వివరణ కోరగా పుల్ల ట్రాక్టర్లకు పర్మిషన్లు తప్పనిసరి అన్నారు. రైతుల అభ్యర్థన మేరకు మామిడి,జీడి మామిడి పుల్ల రవాణాకు అడ్డు చెప్పడం లేదన్నారు. అవినీతి అధికారిపై చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ మెట్ట రైతులు కోరుతున్నారు.


