జంగారెడ్డిగూడెం: సోమవారం ఎర్రకాలవ జలాశయంలో 4.80 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. చక్రదేవరపల్లిలో 1.20 లక్షలు, దేవులపల్లి, తాడువాయి, మతన్నగూడెం రేవుల్లో చేపలు విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడుతూ మత్స్యకారుల ఆదాయ వృద్ధి, ప్రజలకు తాజా చేపల లభ్యత ద్వారా పోషక భద్రత కల్పిస్తున్నామన్నారు. నాణ్యమైన చేపలకు 40 శాతం సబ్సిడీతో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, జడ్పీటీసీ పొల్నాడు బాబ్జి, దాకారపు కృష్ణ పాల్గొన్నారు.
అత్తిలి: అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం అత్తిలి మండలం స్కిన్నెరపురంలో జరిగింది. ఎస్సై పి.ప్రేమరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కాళ్ల మండలం జక్కరం గ్రామానికి చెందిన నాగలక్ష్మి(23)కి, అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామానికి చెందిన కళ్యాణి దుర్గారావుతో 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త రొయ్యల కంపెనీలో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో అదనపు కట్నం తీసుకురావాలని, అలాగే అత్తవారి ఇంటి నుంచి రావాల్సిన స్థిరాస్తిని కూడా తన పేరిట రాయించాలని భర్త వేధించడంతో నాగలక్ష్మి మనస్థాపం చెందింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి వెంకన్నబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
జంగారెడ్డిగూడెం: ప్రమాదవశాత్తు వృద్ధుడిపై చెట్టు విరిగిపడి మృతి చెందాడు. దీనికి సంబంధించి స్టేషన్ హెచ్సీ ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన యడ్లపల్లి బొజ్జియ్య (62)తో పాటు కొంతమంది కూలీలు శ్రీనివాసపురం ప్రభుత్వ టింబర్ డిపోలో కూలీలుగా పనిచేస్తున్నారు. బొజ్జియ్య గత 30 ఏళ్ళుగా అదే టింబర్లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు కొంత మంది కూలీలతో బయలుదేరి టింబర్ డిపోలో వెదురు కర్రల లోడు చేస్తున్నారు. ఉదయం 9 గంటల సమయంలో పక్కనే ఉన్న చెట్టు విరిగి బొజ్జియ్యపై పడింది. వెంటనే అతన్ని స్ధానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికీ అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


