పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం కల్యాణోత్సవ ఆహ్వాన పత్రికల్లో రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణకు పేరు లేకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఈ నెల 27 నుంచి పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో కల్యాణోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల ఆహ్వాన పత్రికల్లో స్థానిక మంత్రితో పాటు జిల్లాలో ఉన్న శాసనసభ సభాపతి, ఉప సభాపతి, ఎమ్మెల్సీలు, ఇన్చార్జి మినిస్టర్, జిల్లా పరిషత్ చైర్మన్ పేర్లు వేశారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ పేరు వేయలేదు. నిత్యం అధికార పార్టీ వెన్నంటి ఉండి ప్రతి కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషిస్తున్న కొందరు బీజేపీ నాయకులు సైతం దీనిపై స్పందించకపోవడం గమనార్హం. ఈ విషయంపై పట్టణ గౌడ సంఘం నాయకులు స్పందించారు. కల్యాణోత్సవ ఆహ్వాన పత్రికల్లో పాకా సత్యనారాయణ పేరు వేయకుండా అవమానించారని తప్పుపట్టారు. ముద్రణ సమయంలో ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు చూసుకోకుండానే ముద్రిస్తారా? అని అనుమానం వ్యక్తంచేశారు. ముందుగా ప్రింటింగ్ వేసిన ఆహ్వాన పత్రికలకు సుమారు రూ. 25 వేల వరకూ ఖర్చయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. మళ్లీ కార్డులు ప్రింటింగ్ వేయిస్తున్నట్లు సమాచారం అందిందని అన్నారు.


