తాడేపల్లిగూడెం: పట్టణంలో గురువారం నుంచి ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. గురువారం ఉగాది, బలుసులమ్మవారి జాతరలో భాగంగా నైవేద్యాల కార్యక్రమం ప్రారంభమవుతుండడంతో పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలను సీఐ బోణం ఆదిప్రసాద్, ఎస్సై నాగరాజు బుధవారం వెల్లడించారు. గురువారం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. భీమవరం నుంచి వచ్చే వాహనాలు యాగర్లపల్లి రెండోఫ్లైఓవర్ వంతెన మీదుగా బస్టాండ్కు చేరుకుంటాయి. ఒకటో వంతెన మీదుగా ఎలాంటి వాహనాలు అనుమతించరు. భక్తులను మాత్రమే అనుమతిస్తారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తాలూకా ఆఫీస్ సెంటర్ నుంచి కృష్ణా బాలాజీ ధియేటర్ వరకు వచ్చి, అక్కడ ఏర్పాటుచేసిన ప్రాంతంలో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. ఉగాది రోజున 150 మంది సిబ్బంది. 25 మంది మహిళా పోలీసులను ఏర్పాటుచేశారు. నైవేద్యాల రోజున 400 మంది సిబ్బందిని వినియోగించనున్నట్టు సీఐ ఆదిప్రసాద్ చెప్పారు. భక్తులు ఈ మేరకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజి పాల్గొన్నారు.


