జిల్లాలో పన్నుల వివరాలు
● పన్ను వసూళ్లకు ఒత్తిళ్లు
● సర్వేల భారం
● ఆందోళనలో కార్యదర్శులు
యలమంచిలి: పంచాయతీ కార్యదర్శులు విధి నిర్వహణలో ఒత్తిళ్లకు గురవుతున్నారు. రోజువారీ విధులతో పాటు సర్వేలు భారంగా మారాయి. ఇదిలా ఉండగా పన్నుల వసూలు బాధ్యతలను అప్పగించడంతో సతమతమవుతున్నారు. ఉద్యోగుల కొరతతో ఒక్కో కార్యదర్శి రెండు నుంచి ఐదు గ్రామాల బాధ్యతలు చూసుకోవాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడం, ఉద్యోగులను ఇతర శాఖలకు బదలాయించడంతో సర్వేల భారం కార్యదర్శులపై పడింది. అలాగే పన్ను వసూళ్లకు టార్గెట్ విధించడం, నెలాఖరులోపు నూరు శాతం వసూలు చేయాలని ఆదేశించడంతో కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు.
ఇంటింటా తిరుగుతూ.. జిల్లాలోని 20 మండలాల్లో 3,35,182 పన్ను అసెస్మెంట్లు పూర్తిచేయాల్సి ఉండగా సోమవారం ఉదయం నాటికి 83.17 శాతం వసూలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన బకాయిలను నెలాఖరులోపు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఆన్లైన్ విధానంతో సాంకేతిక సమస్యలు ఎదురవడం, సమయం తక్కువ ఉండటంతో కార్యదర్శులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు. దీంతో పాటు ఫ్యామిలీ యూనిఫైడ్ సర్వే, బంగారు కుటుంబ సర్వే వంటి సర్వేలు చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో ఎంతో మేలు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పాలన సాగించేవారు. సచివాలయాల్లోని ఉద్యోగులకు నిర్దిష్ట విధులను కేటాయించారు. దీంతో సర్వేలు, తదితర పనులను ఆయా ఉద్యోగులు నిర్వర్తించేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం పంచాయతీ అధికారులపై కక్షపూరిత వాతావరణంలో సర్వేలు చేయించడం ఎంత వరకు సమంజసమో అర్థం కావడం లేదని పలువురు కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు.
మండలాలు 20
అసెస్మెంట్లు 3,35,182
పాత బకాయిలు రూ.249.89 లక్షలు
కరెంట్ డిమాండ్ రూ.3,935.55 లక్షలు
మొత్తం డిమాండ్ రూ.4,185.44 లక్షలు
ఇప్పటివరకూ వసూలు రూ.3,480.93 లక్షలు
వసూలు శాతం 83.17
వసూలు చేయాల్సింది రూ.704.51 లక్షలు


