భీమవరం (ప్రకాశంచౌక్): ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ల హక్కుల సాధనకు ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రతి జిల్లాలో తాలూకా స్థాయి నుంచి కార్యాచరణ సమితులను పునర్నిర్మాణం చేస్తున్నట్లు జిల్లా జేఏసీ జనరల్ సెక్రెటరీ కేవీ రామచంద్రరావు తెలిపారు. స్థానిక ఏపీఎన్జీవో అసోసియేషన్ బిల్డింగ్ నందు భీమవరం తాలూకా జేఏసీ చైర్మన్ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం నూతనంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. భీమవరం తాలూకా జేఏసీ చైర్మన్గా బండారు సోమేశ్వరరావు, కార్యదర్శి కే రామకృష్ణ ప్రసాద్, కోశాధికారి వి కుమార్, తదితర మొత్తం 25 మంది కార్మిక సభ్యులను ఎన్నుకన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో గృహావసరాల నిమిత్తం వంటగ్యాస్ కొరత లేదని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రస్తుతం గృహ అవసరాలకు సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. అయితే కమర్షియల్ గ్యాస్ సరఫరా కొంత తగ్గడంతో రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గృహ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా కొనసాగుతోందన్నారు. పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్కు 25 రోజుల గడువు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం గృహ అవసరాలకు బుక్ చేసిన రెండు రోజుల్లోనే గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
వదంతులను నమ్మవద్దు : జిల్లాలో మొత్తం 49 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తుండగా సుమారు 56 వేల బుకింగ్స్ పెండింగ్లో ఉండగా ప్రస్తుతం 23,335 గ్యాస్ రీఫిల్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గ్యాస్ ఏజెన్సీలు అదనంగా 32,392 సిలిండర్లకు ఇండెంట్ పెట్టినట్లు చెప్పారు. ఇప్పటికే ఒక సిలిండర్ ఉండగానే మరో సిలిండర్ బుక్ చేయడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందరని, గ్యాస్ కొరత ఉందనే వదంతులను నమ్మకుండా ప్రజలు సహకరించాలని కోరారు. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వాణిజ్య సంస్థల్లో అక్రమంగా వినియోగిస్తున్న 93 గృహ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని 6 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లా ప్రజల గ్యాస్ సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ 81216 76653 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఆచార్యుడు డాక్టర్ వినోద్కుమార్ రాజా జల్శక్తి హ్యాకథాన్ 2026 అవార్డుకు ఎంపికయ్యారు. ఇండిజెనస్లో కాస్ట్ బెంబో నైట్ అధారిత సిరామిక్ మల్లీచానల్ సిరామిక్ ట్యూబులర్ మెంబ్రేన్స్ ద్వారా డీసెంట్రలైజ్డ్ మురుగునీటి శుద్ధి అనే వినూత్న ప్రాజెక్టును సమర్పించినందుకు అవార్డు వచ్చింది. ఈ నెల 23న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి చేతుల మీదుగా అవార్డుతో పాటు రూ.లక్ష నగదును ఆయన అందుకుంటారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
కొయ్యలగూడెం: పచ్చని పంటలు పండే వ్యవసాయ భూముల్లో నేవీ డిపో ఏర్పాటు చేసి ప్రజల జీవితాల్లో చిచ్చు పెట్టవద్దని సీపీఐ మండల కన్వీనర్ తాడిగడప ఆంజనేయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మంగపతిదేవిపేట, బోడిగూడెం గ్రామాల ప్రజలతో కలసి వ్యవసాయ పొలాల్లో డిపో నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. రెండు పంటలు పండే సారవంతమైన వ్యవసాయ భూముల్లో ప్రమాదకరమైన ఆయుధ డిపో ఏర్పాటు చేయాలనుకోవడం అన్యాయం అన్నారు. చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ భూములను లాక్కోవద్దని కోరారు. కార్యక్రమంలో బోడిగూడెం, మంగపతిదేవిపేట, ఊట్లగూడెం గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


