ఏలూరు (టూటౌన్): ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం అన్నే భవనంలో రబీ ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆయన మాట్లాడారు. ఉంగుటూరు, దెందులూరు మండలాల్లో కొన్ని గ్రామాల పరిధిలో రబీ వరి కోతలు జరుగుతున్నాయని, రైతులు ధాన్యం అమ్ముకోవడానికి సిద్ధం చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దళారులకు ధాన్యం అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు తెరవడం వల్ల రైతులకు ప్రయోజనం లేదన్నారు. రబీ ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.


