ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో బీసీలంటే కూటమి ప్రభుత్వానికి చులకనగా ఉందా అని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై పార్టీ) రాష్ట్ర కో కన్వీనర్ నెరుసు నాగమణి యాదవ్ ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక సాహిత్య మండలి హాలులో ఆమె విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు బీసీలకు ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని, వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను విస్మరిస్తే ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీవై పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ ఆకుల వెంకట స్వామి మాట్లాడుతూ బీసీల కోసం 5 డిమాండ్లతో తమ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఇచ్చిన అల్లిమేటం గడువు మార్చి 31తో ముగిసిందని, ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 11న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా దీక్ష కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో నాయకులు సర్నాల శివరాణి, తోకల రామకృష్ణ, అనగాని రామ్ ప్రసాద్, వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సెల్ టవర్ నిర్మాణంపై స్థానికుల ఆందోళన
కొయ్యలగూడెం: సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అశోక్ నగర్ ప్రాంతవాసులు శుక్రవారం పనులను అడ్డుకున్నారు. నివాసిత ప్రాంతాల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయడం వలన ఆరోగ్యరీత్యా దుష్పరిణామాలు ఎదుర్కొంటామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అనుమతులు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటుండగా ప్రభుత్వ పరంగా ఉండాల్సిన అనుమతులు లేవని స్థానికులు ఆరోపించారు. దీనిపై నిర్మాణదారులకు నివాసితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అన్ని అనుమతులు ఉంటేనే పనులను ప్రారంభించండని స్థానికులు పేర్కొన్నారు. దీనిపై పంచాయతీ, రెవెన్యూ శాఖ అధికారులకు వారు ఫిర్యాదు చేశారు.


