చందమామ కథలొద్దు బాబూ!
ఆకివీడు: ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు చందమామ కథల్ని తలపిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలు పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా జిల్లాలో పాదయాత్ర ప్రారంభించామన్నా రు. కుప్పనపూడి గ్రామ శివారు తాళ్లకోడులోని జగనన్న కాలనీలో పాదయాత్రను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల్ని చర్చించాల్సిన అసెంబ్లీలో లడ్డూపై చర్చించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను కులం, మతం, ప్రాంతం పేరుతో విభజిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా డీఎస్సీ అంటూ తెరపైకి వచ్చారని, ఏజెన్సీలో డీఎస్సీ ఏమైందని ప్రశ్నించారు. అభివృద్ధికి దూరంగా టిడ్కో ఇళ్లు, పేదల కాలనీలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు 2, 3 సెంట్ల ఇళ్ల స్థలాల హామీని గాలికి వదిలేశారని విమర్శించారు. ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్న ఎమ్మెల్యే పేదల ఇళ్లు పీకించడం అభివృద్ధా అని ప్రశ్నించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరామ్ మాట్లాడుతూ జిల్లాల్లో ఉన్న పరిశ్రమలు మూతపడుతుంటే ఆపలేని చంద్రబాబు సింగపూర్ వెళ్లి పరిశ్రమలు తెస్తారంటా అని ఎద్దేవా చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారాం, సీనియర్ నేత కె.రాజారామ్మోహన్రాయ్, కార్యదర్శివర్గ స భ్యులు కేతా గోపాలన్, బి.వాసుదేవరావు, పీవీ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు


