భాషను గుర్తించేదే ఎల్ఎల్ఎం
నూజివీడు: లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం) అనేది ఒక అధునాతన కృత్రిమ మేధస్సు ప్రోగ్రామ్ అని, దీనివల్ల అనేక ఉపయోగాలున్నాయని గ్నోరెక్స్ లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రహిమునిద్దీన్ పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో తెలుగుశాఖ ఆధ్వర్యంలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనే అంశంపై నిర్వహిస్తున్న వర్క్షాప్ రెండో రోజైన గురువారం కొనసాగింది. దీనిలో పాల్గొన్న రహిమునిద్దీన్ మాట్లాడుతూ ఇది భాషలోని నమూనాలను గుర్తించి, సహజమైన వాక్యాలను రూపొందించే విధానాన్ని, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, వ్యాసాలు రాయడం, అనువాదం చేయడం, సారాంశం తయారు చేయడం వంటి పనులను ఎల్ఎల్ఎం చేస్తుందన్నారు. ఇవి విస్తృతశ్రేణి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని, వ్యాసాలు, ఇమెయిల్లు, కోడ్, సృజనాత్మక కథలు, పద్యాలు తదితరమైనవి రాస్తాయన్నారు. అంతేగాకుండా శిక్షణ పొందిన డేటా ఆధారంగా సమాచారాన్ని అందించడం, వచనాన్ని ఒక భాష నుంచి మరొక భాషలోకి మార్చడం, పొడవైన పత్రాలు లేదా కథనాలను చిన్న సారాంశాలుగా కుదించడం చేస్తాయన్నారు. ఈ పద్ధతిలోని డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్ సాంకేతికతలు విద్య, వైద్యం, వ్యాపారం, ప్రభుత్వ సేవలు వంటి అనేక రంగాల్లో ఉపయోగపడుతున్నాయన్నారు. అనంతరం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎర్రా చిరంజీవి వర్చువల్గా స్పీచ్ టూ స్పీచ్ మెషీన్ ట్రాన్స్లేషన్ అనే అంశంపై మాట్లాడుతూ సాంకేతికత ద్వారా ఒక భాషలో మాట్లాడిన మాటలను మరో భాషలోకి మాటల రూపంలోనే మార్చవచ్చన్నారు. ఈ ప్రక్రియలో ఇది ముందుగా మాటను టెక్ట్స్గా మార్చి తరువాత అనువదించి మళ్లీ శబ్ధంగా మారుస్తుందన్నారు. దీనివల్ల ప్రయాణాలు, సమావేశాలు, అంతర్జాతీయ సంభాషణల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ముగింపు సందర్భంగా అతిథులను ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ సన్మానించారు.
ట్రిపుల్ ఐటీలో ముగిసిన వర్క్షాప్


