శ్రీవారి కొండపై రోడ్డు ప్రమాదం
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన జంటగోపురాల ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం. కాళ్ల మండలం వేంపాడు గ్రామానికి చెందిన అమిరపు సురేష్(46) కొందరు గ్రామస్తులతో కలసి మినీ ట్రావెల్ బస్సులో బుధవారం రాత్రి 8 గంటలకు వివాహ వేడుక నిమిత్తం క్షేత్రానికి విచ్చేశాడు. వివాహానంతరం గురువారం తెల్లవారుజాము 2.45 గంటలకు ఉండి మండలం చిలుకూరి గ్రామానికి చెందిన డ్రైవర్ గోడి ఏలియ బస్సును ఘటనా స్థలంలోని డౌన్లో పెట్టి, ఇంజన్ స్టార్ట్ చేసి, బస్సు దిగాడు. ఆ తరువాత బస్సు ముందు ఉన్న సురేష్తో మాట్లాడుతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా బస్సు ముందుకు దూసుకొచ్చి, ముందు చక్రం సురేష్ మీద నుంచి వెళ్లింది. అనంతరం సెక్యురిటీ ఉండే మూవింగ్ క్యూలైన్ను ఢీకొట్టి బస్సు నిలిచిపోయింది. అయితే బస్సు కింద పడి తీవ్ర గాయాలు పాలైన సురేష్ను హుటాహుటీన స్థానికులు 108 ఆంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 15 మంది మహిళలు ఉన్నారు. బస్సు మూవింగ్ క్యూలైన్ను ఢీకొట్టి నిలవకపోయి ఉంటే, కొండ కిందకు దూసుకెళ్లి పెనుప్రమాదం జరిగేది. ఈ ఘటనపై మృతుడి తండ్రి సత్యన్నారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు.
బస్సు ఢీకొని వ్యక్తి మృతి
శ్రీవారి కొండపై రోడ్డు ప్రమాదం


