పెనుగొండ ఎంపీడీవో పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి
పెనుగొండ: పెనుగొండ ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల వ్యాప్తంగా జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పురోగతిపై సమీక్షించారు. సర్వే నత్త నడకన సాగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం జేశారు. రెండు రోజుల్లో టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తణుకులో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న వన్స్టాప్ సెంటర్ లో కాంట్రాక్ట్ పద్దతిపై పని చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మహిళా,శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి డి.శ్రీలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ –1, కేసు వర్కర్ – 2, పారా లీగల్ పర్సనల్/లాయర్ –1, పారా మెడికల్ పర్సనల్ – 1, సైకో సోషల్ కౌన్సెలర్–1, కంప్యూటరు పరిజ్ఞానం ఉన్న ఆఫీసు అసిస్టెంట్–1, మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్ – 3, సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్ –3 పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి కార్యాలయంలో మార్చి 7న సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని కోరారు.
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం తహసీల్దార్ పీవీ చలపతిపై వీఆర్వోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో దూషిస్తున్నారని, అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని అంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీఆర్వోలు మాట్లాడుతూ మహిళా వీఆర్వోలు సంతకాల కోసం తహసీల్దార్ రూంకు వెళ్తే గంటల తరబడి నిలబెట్టి సంతకం పెట్టకుండా అసభ్యకర పదజాలంతో తిడుతున్నారని తెలిపారు. కోయ వాళ్లకు ఏం పని రాదు వీళ్లను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలంటూ కులం పేరుతో తిడుతూ అవమానిస్తున్నారని చెప్పారు. తహసీల్దార్పై చర్యలు తీసుకుని నాయ్యం చేయాలని డిమాండ్ చేశారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): త్వరలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా తెరపైకి తీసుకువచ్చిన ఇన్విజిలేషన్ ఆటోమేషన్ విధానాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యర్శులు ఈ. రామ్మోహన్, జీ. మోహన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇన్విజిలేషన్ ఆటోమేషన్ కారణంగా పరీక్షల నిర్వహణలో అధిక పరిపాలన కేంద్రీకరణ చోటుచేసుకుని, అనవసర గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇది ఉపాధ్యాయుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, తల్లిదండ్రులలో పరీక్షల నిర్వహణపై అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు.
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో సిగరెట్ మాఫియా యథేచ్ఛగా పేట్రేగిపోతుందని ఈ మాఫియాను తక్షణం ప్రభుత్వం అరికట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ ముందు నుంచి కృత్రిమ కొరత సృష్టించి, అధిక రేట్లకు విక్రయిస్తూ వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారని విమర్శించారు. రూ.170 ఉన్న పెట్టె రూ.250 అమ్ముతూ రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్న మాఫియాను అరికట్టాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.


