ఆందోళన కలిగిస్తున్న గర్భస్రావాలు
మండలిలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్
తణుకు అర్బన్: ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వా సుపత్రుల్లో జరుగుతున్న గర్భస్రావాలు ఆందోళన రేపుతున్నాయని, వాటిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. బుధవారం శాసనమండలిలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. 5 మండలాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత 9 నెలల కాలంలో 281 గర్భస్రావాలు జరిగాయని ఇది చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి నిజంగా అబార్షన్ జరిగిందా లేదా.. ప్రభుత్వం ఇస్తున్న లక్ష్యాలను పూర్తి చేయలేక ఫాల్స్ అబార్షన్ రికార్డ్ చేస్తున్నారా అనే విషయాన్ని పరిశోధించాలని కోరారు. నిజంగా అబార్షన్లు జరిగితే అందుకు కారణాలను గుర్తించి గర్భిణి మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, పోషక ఆహారం, సప్లిమెంటరీ మందులు సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేశారు. బుట్టాయ గూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఎంఎస్ఎంఈ విభాగంలో ఎస్సీ వర్గాలకు గత ఏడాది ఇన్సెంటివ్స్ సక్రమ విధానంలో ఇవ్వలేదని, అనుకూల వర్గాలకు మాత్రమే ఇన్సెంటివ్స్ ఇచ్చారని, షెడ్యూల్డు కులాలు, చిన్న పరిశ్రమలు పెట్టుకున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు.


