వేతనాలు పెంచే వరకు ఉద్యమం ఆగదు
భీమవరం (ప్రకాశంచౌక్): వేతనాలు పెంచే వరకు ఉద్యమం ఆగదు అని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద అంగన్వాడీ హెల్పర్లు ఆందోళన చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అంగన్వాడీ హెల్పర్లు ఆందోళనలో పాల్గొన్నారు. కేవలం రూ.7 వేలతో కుటుంబాలను ఎట్లా నెట్టుకొచ్చేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా నాయకుడు ఎం. ఆంజనేయులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు వికసిత ఆంధ్రప్రదేశ్కు చాలా దూరంలో ఉన్నాయని అన్నారు. అధికారం కోసం వాగ్దానాలు చేసిన కూటమి ప్రభుత్వం కేంద్ర పాలకులు, పెట్టుబడిదారుల అడుగులకు మడుగులొత్తుతున్నారని అన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా పోరాటం కొనసాగుతుందని అన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం మాట్లాడుతూ పాఠశాల విద్యారంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష తప్పనిసరి అనే నిబంధన సరికాదన్నారు. రెండు సంవత్సరాల లోపు పాస్ కానిచో ఉపాధ్యాయ ఉద్యోగ అర్హత కోల్పోతారని, పదోన్నతి రాదని వారిని ఇబ్బందులు గురి చేయడం వారి అనుభవానికి ఇబ్బందిగా ఉందన్నారు. సదరు ఉపాధ్యాయుల సీనియార్టీని, అనుభవాన్ని పరిగణలో తీసుకుని టెట్ నోటిఫికేషన్కి ముందు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని, పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని ఎంపీని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ సీహెచ్ సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు కండిపోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
తణుకు అర్బన్: రాష్ట్రంలో 12 డిపోల ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ బాధ్యతలు పినాకిల్ సంస్థకు అప్పగించడం, 4 డిపోల షెడ్యూల్స్తో పాటు సిబ్బందిని వేరే డిపోలకు బదిలీ చేసే కార్యక్రమం మొదలు పెట్టిన విధానాన్ని నేషనల్ మజ్దూర్ యూనిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం తణుకు డిపోలోని యూనిటీ సభ్యులు మొదటి సర్వీస్ నుంచి ఎరుపు రంగు బ్యాడ్జీలు ధరించి, గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో యూనిటీ కార్యదర్శి బయ్య వెంకట సుబ్బారావు, అధ్యక్షులు సరిదే ఏసుబాబు, పాల్గొన్నారు.
తణుకు అర్బన్: సమస్యల పరిష్కారం నిమిత్తం గత 9 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సహకార ఉద్యోగులను పట్టించుకోపోవడం సిగ్గు చేటని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ.ప్రతాప్, సహకార ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సీహెచ్ వెంకటేశ్వరరావు విమర్శించారు. మంగళవారం స్థానిక కోర్టు వద్ద 9వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా రోడ్డు మీద పడుకొని దండం పెడుతూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ప్రతాప్, వెంకటేశ్వరరావు, ఐలు జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ సహకార సంఘ సమస్యలు పరిష్కారం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదని స్పష్టం చేశారు. తక్షణమే సమస్యలపై చర్చలు జరపాలని లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
వేతనాలు పెంచే వరకు ఉద్యమం ఆగదు
వేతనాలు పెంచే వరకు ఉద్యమం ఆగదు


