టీడీపీ నేతలకు చేదు అనుభవం
కొయ్యలగూడెం: నేవీ ఆయుధ డిపో నిర్మాణంపై చర్చల కోసం వచ్చిన టీడీపీ నేతలకు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గ టీడీపీ నేతలు బోడిగూడెం, మంగపతిదేవిపేట గ్రామాలకు వెళ్లగా నేతలు వస్తున్న సమాచారంతో గ్రామస్తులు రోడ్డుపైకి చేరుకొని వారి వాహనాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో నాయకులు తమ వాహనాలు దిగి గ్రామస్తులను సర్ది చెప్పడానికి ప్రయత్నించగా మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటూ తమ నోటి దగ్గర జీవనాధారం లాక్కోవాలని చూస్తే ప్రాణత్యాగానికై నా వెనుకాడమని హెచ్చరించారు. తమని విభజించి లోబరుచుకోవడానికి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలని లేని పక్షంలో మున్ముందు నాయకులను ఏ కారణం చేత కూడా గ్రామాలలో తిరగనివ్వమని పేర్కొన్నారు. కూటమి నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఇప్పటికే 60 శాతానికి పైగా రైతులు నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి సముఖత వ్యక్తం చేస్తూ ఆమోద పత్రాలు అందజేశారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సైతం అధికార పార్టీ కోసం రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. దీంతో నాయకులు చర్చలు నిర్వహించకుండానే వెనుదిరిగారు.


