అక్రమ కలప స్వాధీనం
కొయ్యలగూడెం: అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నట్లు కన్నాపురం ఫారెస్ట్ రేంజర్ భాను ప్రకాష్ శనివారం తెలిపారు. రాజవరం సమీపంలో రహస్య ప్రదేశంలో అక్రమ కలపను నిల్వ ఉంచారన్న సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. ఈ నేపథ్యంలో సుమారు రూ. లక్ష విలువైన 20 టేకు దిమ్మలు గుర్తించి కన్నాపురం రేంజ్ కార్యాలయానికి తరలించామన్నారు.
ఉండి: తేనెటీగల పెంపకంపై ఔత్సాహిక రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తేనెకు మంచి మద్దతు ధరను ప్రకటించాలని బాపట్ల కీటక శాస్త్ర ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ కోటేశ్వరరావు కోరారు. ఎన్నార్పీ అగ్రహారంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కొద్దిరోజులుగా జరుగుతున్న శాసీ్త్రయ తేనెటీగల పెంపకం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తేనె వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం తేనెలో కల్తీని ఏవిధంగా గుర్తించగలమో వివరించారు.
పోలవరం రూరల్: పోలవరం మండలం పట్టిసం శివక్షేత్రం రేవులో నిత్యం తిరుగుతున్న ఫెర్రీ లాంచీ నిబంధనలకు విరుద్ధగా తిరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాయంత్రం 6 గంటలకే బోట్లు నిలిపివేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఏడు గంటల వరకు యథేచ్ఛగా తిరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీనిపై శనివారం సాయంత్రం రేవులో విలేకరులు లాంచీ ఆలస్యంగా తిరగడంపై ప్రశ్నించగా, స్థానిక కూటమి భాగస్వామ్యంలోని పార్టీ నాయకులు దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నా అధికారులు మౌనం వహించడంపై పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


