కోతకు గురవుతున్న ఆలయం
పోలవరం రూరల్: అఖండ గోదావరి నది మధ్య పోలవరం ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రసిద్ధి చెందిన మహానందీశ్వరస్వామి ఆలయానికి ఒక వైపు వరదల ప్రభావంతో కోతకు గురవుతోంది. గత కొన్నేళ్ళుగా స్పిల్వే దిగువ నుంచి వరద ప్రవాహం ఉండటంతో ఆలయం చుట్టూ ఉన్న గట్టు మరింతగా కోతకు గురైంది. లంక ఒడ్డు పూర్తిగా కోతకు గురికావడంతో, దిగువన నిర్మించిన అన్నదాన శిబిరం భవిష్యత్తు ప్రశార్థకంగా మారింది. మళ్లీ వరద సమయానికి ఇది మరింత పెరిగితే అన్నదాన శిబిరం గోదావరిలో కలిసిపోయే పరిస్థితి ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి దాతల సహకారంతో మోటార్లు ఏర్పాటు చేసి మంచినీటి వసతి, మరుగుదొడ్లు, నిర్వాహకులు ఉండేందుకు వీలుగా గదుల నిర్మాణాలు జరిగాయి. సెలవు దినాల్లో వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. నందీశ్వరస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పోలీస్ చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్టు దాటి వెళ్లడానికి అందరికీ అనుమతులు లేవు. మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో ఈ క్షేత్రానికి భక్తులు వెళ్ళేందుకు అనుమతులు రావడంతో సుమారు 10 వేల మంది వరకు దర్శించుకున్నారు.


