అక్రమాలకు ఆరోగ్యసిరి
ప్రజారోగ్యం.. ప్రభుత్వం వైఫల్యం
తణుకుకు చెందిన ఓ మహిళ ప్రమాదవశాత్తూ పడిపోవడంతో కాలు విరిగింది. కుటుంబసభ్యులు ఆమెను స్థానికంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కార్డు చూపించి వైద్యం చేయాలని కోరారు. అప్రూవల్ వచ్చే వరకూ ఖర్చులు భరించాలంటూ, ఎక్స్రే, రక్త పరీక్షలంటూ ఆస్పత్రి సిబ్బంది రూ.6,700 వరకు కట్టించుకున్నారు. రూమ్లో అడ్మిట్, వైద్యం నిమిత్తం మరో రూ.15,000 కట్టాలన్నారు. తాము చెల్లించలేమని కుటుంబ సభ్యులు ఆమెను నెట్వర్క్ పరిధిలోని మరో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ ఉచితంగా పరీక్షలు, శస్త్రచికిత్స చేశారు.
గతంలో పారదర్శకంగా..
ఎన్టీఆర్ వైద్య సేవల్లో డబ్బులు తీసుకున్నట్టు నిర్ధారణయితే పెద్ద మొత్తంలో పెనాల్టీతో పాటు రిజిస్ట్రేషన్ రద్దు నిమిత్తం సిఫార్సు చేసేందుకు కూడా వెనుకాడేది లేదు.
– కలెక్టర్ సీహెచ్ నాగరాణి
ఎన్టీఆర్ వైద్య సేవలపై సెప్టెంబరులో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ నాగరాణి ఆస్పత్రి యాజమన్యాలను ఇలా హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత సేవలు అందిస్తుందని, ఎక్కడైనా డబ్బులు వసూలు చేస్తే సహించమన్నారు. కొన్ని ఆస్పత్రులపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని, వాస్తవం అని తేలితే పెద్ద మొత్తంలో పెనాల్టీతో పాటు, రిజిస్ట్రేషన్ రద్దు నిమిత్తం సిఫార్సుకు వెనుకాడేది లేదన్నారు. 16 నెట్వర్క్ ఆస్పత్రులపై ఆరోపణలు రాగా వాటిలో రెండింటిపై రుజువు కావడంతో అప్పట్లో జరిమానాలు విధించారు.
సాక్షి, భీమవరం: కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ఆసరాగా చేసుకుని ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) సేవలను కొన్ని ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. అధికారుల హెచ్చరికలను బేఖాతరు చే స్తూ ఉచిత వైద్య సేవలకు రోగుల నుంచి సొ మ్ములు వసూలు చేస్తున్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రులు 42 ఉండగా ప్రైవేట్ ఆస్పత్రులు 30 వరకు ఉన్నాయి. ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో 22 మల్టీ స్పెషాలిటీ, ఎనిమిది డెంటల్ ఆస్పత్రులు ఉన్నాయి. ఈ పథకం కింద వైద్యసేవ పొందే రోగికి ఉచిత అడ్మిషన్, అవసరమైన వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలతో పాటు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకూ మందులు, రూమ్ సదుపాయం, అల్పాహారం, రెండు పూటలా భోజనం, వైద్యసేవలు అందించాలి. డిశ్చార్జి సమయంలో రోగికి సరిపడా మందులు ఇచ్చి పంపాలి. కాగా మత్తు ఇచ్చేందుకనో, వైద్యానికి అప్రూవల్ రావడానికి ఆలస్యమవుతుందనో, కొన్ని వైద్య పరీక్షలు బయట చేయించాలనో, మందులు కోసమనో.. రకరకాల కారణాలు చెప్పి రోగుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఎందుకొచ్చిన గొడవన్నట్టు చాలామంది రోగులు ఆస్పత్రి యాజమాన్యాలు అడిగినంత సొమ్ములు చెల్లించి అక్కడితో వదిలేస్తున్నారు. కొందరు బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ముగ్గురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై తణుకులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి రూ.3.02 లక్షలు, భీమవరంలోని మరో ఆస్పత్రికి రూ.68 వేలు జురిమానాలు విధించారు. కొద్దినెలల క్రితం 16 ఆస్పత్రులపై ఫిర్యాదులు రాగా వీటిలో రెండింటిపై ఆరోపణలు నిర్ధారణ కావడంతో వాటికి ఫెనాల్టీలు వేశారు.
ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిల్లుల విడుదల చేయకపోవడం, అజమాయిషీ కొరవడటంతో నెట్వర్క్ ఆస్పత్రుల ఇష్టారాజ్యంగా మారిందంటున్నారు. అనధికార వసూళ్లకు పాల్పడుతూ పేద రోగుల జేబులను ఖాళీ చేస్తున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వైద్య సేవ.. అందని తోవ
ఆపదలో ఆరోగ్యశ్రీ
కూటమి పాలనలో కొరవడిన అజమాయిషీ
నెట్వర్క్ ఆస్పత్రుల చేతివాటం
ఉచిత సేవలకు రోగుల నుంచి డబ్బుల వసూళ్లు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా పథకం అమలు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేసింది. క్యాన్సర్ తదితర ఖరీదైన జబ్బుల చికిత్సకు పరిమితి లేకుండా సాయం అందించింది. 1,059 చికిత్సల సంఖ్య (ప్రొసీజర్ల)ను 3,257కి పెంచడంతో పాటు కు టుంబానికి రూ.5 లక్షలు ఉన్న వ్యయ పరి మితిని రూ.25 లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. వైద్య సేవలకు ఆటంకం రాకుండా నిరంతరం అందిస్తూ వచ్చారు. రోగి కోలుకునే వరకు కుటుంబ పోషణకు ఆరోగ్య ఆసరా పథకం కింద అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించేవారు. అక్రమాలకు తావులేకుండా 14400 టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసే వీలు కల్పించారు. ఇలా ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు.
అక్రమాలకు ఆరోగ్యసిరి


