స్తంభించిన సహకారం
● సొసైటీ ఉద్యోగుల సమ్మెబాట
● సహకార సంఘాల్లో అందని సేవలు
● జిల్లాలో 122 సొసైటీల్లో 415 మంది ఉద్యోగులు
● జీఓ 36ను అమలు చేసి ఉద్యోగులందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి జీతభత్యాలు చెల్లించాలి.
● సహకార ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలి.
● ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేయాల్సి ఉంది. అయితే 2019, 2024లో చేయనందున రెండు వేతన సవరణలతోపాటు అప్పటివరకు మధ్యంతర భృతి చెల్లించాలి.
● 2019 తరువాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలి.
● సహకార ఉద్యోగులకు ఆరోగ్య బీమా రూ.5 లక్షలు కల్పించడంతో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ రూ.20 లక్షలకు కల్పించాలి.
● ఉద్యోగులు మరణిస్తే కారుణ్య నియామకం కింద వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి సొసైటీల్లో ఉద్యోగం ఇవ్వాలి.
ఆకివీడు: తమ సమస్యల పరిష్కారం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సహకార సంఘాల ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఈనెల 16 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లడంతో జిల్లాలోని 122 సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్లు) మూతపడ్డాయి. సొసైటీల కార్యకలాపాలు స్తంభించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. డిసెంబరు మొదటి వారం నుంచి జనవరిలో సంక్రాంతి వరకు దశల వారీగా పోరాటాలు చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం చర్చలకు కూడా పిలవలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు.
జిల్లాలో 415 మంది ఉద్యోగులు
జిల్లాలోని 122 సొసైటీల్లో 415 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా సమ్మెలోకి వెళ్లారు. సహకార ఉద్యోగులకు ప్రభుత్వ గుర్తింపు లేదని, పింఛన్, గ్రాట్యూటీ, బీమా సౌకర్యాలు లేవని వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సంఘాల్లో ఉద్యోగుల జీతభత్యాలు ఇప్పటికీ డ్యూటీ పద్దుల ద్వారానే డ్రా చేస్తున్నారు. సొసైటీల పాలకవర్గం నిర్ణయం మేరకే జీతభత్యాలు ఇవ్వడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.
ప్రభుత్వమే నడపాలి : పాలకవర్గాల ద్వారా నడుస్తూ ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న సొసైటీలను ప్రభు త్వమే నడపాలని రైతులు, ఉద్యోగులు కోరుతున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన రీతిలోనే సంఘాలను విలీనం చేయాలని అంటున్నారు. దీనిద్వారా రుణాల పంపిణీకి, వడ్డీ రాయితీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల భద్రత, ఇతర బ్యాంకింగ్ సేవల్లో పారదర్శకత ఏర్పడుతుందని అంటున్నారు.
సహకార వ్యవస్థలో పారదర్శకత, నిజాయతీ, నిబ ద్ధత, నమ్మకం ఏర్పడటానికి ప్రభుత్వం వాటిని విలీనం చేయాలి. రైతులను భాగస్వామ్యం చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులుగా వీరిని గుర్తించాలి. ఈ మేరకు ప్రభుత్వాలు కమిటీని వేసి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి.
– బొబ్బిలి బంగారయ్య, కో–ఆపరేటివ్
ఎంప్లాయీస్ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఆకివీడు
స్తంభించిన సహకారం


