పసలదీవిలో పోస్టల్ కుంభకోణం
నమ్మించి మోసం చేశారు
● పోస్ట్ మాస్టర్ చేతివాటం
● పొదుపు సొమ్ములు పక్కదారి
నరసాపురం రూరల్: పసలదీవి పోస్టాఫీస్లో ఖాతాదారుల పొదుపు సొమ్ము పక్కదారి పట్టడంతో కలకలం రేగింది. సుమారు 20 ఏళ్లుగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్న రాయప్రోలు ప్రసాద్ వందలాది మంది ఖాతాదారులను నమ్మించి వారి నగదును సొంతానికి వాడుకు న్నట్టు తెలిసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అవకతవకలు జరిగినట్టు సమాచారం. విచారణ పూర్తయితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పోస్టాఫీస్ పరిధిలో పసలదీవి, చామకూరిపాలెం, కొండవీటి కొడప గ్రామాలకు చెందిన సుమారు 2,500 మంది ఖాతాదారులు ఉన్నారు. వీరంతా వివిధ పథకాలు, ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లలో దాచుకున్న సొమ్మును ప్రసాద్ కాజేసినట్టు తెలిసింది. ఖాతాదారులు పోస్టాఫీస్కు వచ్చినపుడు నగదు తీసుకుని పాస్బుక్లు తన వద్దే ఉంచుకునేవాడని, ఈ నగదును డిజిటల్ రికార్డుల్లో నమోదు చేయకుండా సొంతానికి వాడుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మరికొందరి ఖాతాల్లో వేయమని ఇచ్చిన డబ్బును సైతం రికార్డుల్లో రాయకుండా మాయం చేసినట్టు విచారణలో తేలింది. పోస్టల్ శాఖ ఉన్నతాధికారి ఏఎస్పీ నరసింహారావు నేతృత్వంలో సిబ్బంది మూడు రోజులుగా పోస్టాఫీసులో వి చారణ చేస్తుండగా బాధితులు క్యూ కడుతున్నా రు. తనిఖీ సిబ్బంది ఖాతాల ఆడిట్, లావాదేవీల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, విచారణ అనంతరం బాధితులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
తాను గురువారం పో స్టాఫీస్కు వచ్చి ఆరా తీయగా తన ఖాతాల్లో రూ.1,000 మాత్రమే ఉన్నాయనడంతో ఏం చేయాలో తెలియలేదు. మా కుమార్తెల వివాహ సమయానికి వచ్చేలా రూ.లక్ష, రూ.40 వేలు డిపాజిట్ చేయమని పోస్ట్మాస్టర్ ప్రసాద్కు ఇచ్చాను. నన్ను నమ్మించి నిండా మోసం చేశాడు.
– గన్నాబత్తుల సత్యచంద్రకళ, బాధితురాలు


