మొక్కుబడిగా పొలం పిలుస్తోంది
అంతా తూతూమంత్రమే
కనిపించని అధికారులు
తణుకు అర్బన్: రైతుకు వెన్నుదన్నుగా నిలబడాల్సిన వ్యవస్థలు రైతాంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సదస్సుల ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకునే వైనంతోపాటు దిగుబడులను పెంచడం, తెగుళ్ల నివారణకు అవసరమైన సూచనలు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. గిట్టుబాటు ధరలు అధికంగా వచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతోపాటు కౌలు రైతుల పట్ల మరింత శ్రద్ధ వహించి బిందు, తుంపర సేద్యం పరికరాల వినియోగంపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
రైతులకు తగ్గిన ఆసక్తి
గ్రామాల్లో కనీసం వారానికి రెండు రోజులు వ్యవసాయ క్షేత్రంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాలు నిర్వహించాలి. అయితే మొక్కుబడిిగా వచ్చామా, వెళ్లామా అన్నట్లుగానే వ్యవసాయ శాఖ పనితీరు ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రైతులు పొలం పిలుస్తోంది కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో తుపాను కారణంగా నష్టపోయిన పంటకు ఇంతవరకు నష్టపరిహారం అందచేయలేని పరిస్థితుల్లో చంద్రబాబు సర్కారు ఉందని, పంట నష్ట నమోదుతోపాటు అందుకు తగ్గ వివరాలను రైతులకు అందచేయడంలో కూడా వ్యవసాయ శాఖ విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో ఆయకట్టుకు సంబంధించి 2,80,000 ఎకరాలు ఉండగా ఇందులో 2,20,000 ఎకరాల్లో వరితో పాటు వివిధ పంటలు పండిస్తున్నారు. 1,20,000 మంది రైతులు ఉండగా, 80 వేల మంది కౌలు రైతులు సాగుచేస్తున్నారు. గతంలో ఖరీఫ్లో సుమారుగా 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, రబీలో 7.20 లక్షల మెట్రిక్ టన్నులు పంట దిగుబడి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దుక్కి దున్నడం, ఏ పంటకు ఎరువు ఎంత వాడాలి, నారు దశలో జాగ్రత్తలు, ఈనిక, కోతల సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కూలంకషంగా వివరించేవారు. ప్రస్తుతం పంటకు ఏ పరిస్థితుల్లో ఏ పురుగు మందులు వినియోగించాలి, ఎంత యూరియా చల్లాలనే విషయాలు సవివరంగా వినిపించే పరిస్థితులు పోయాయని చెబుతున్నారు.
హాజరుకాని మిగిలిన శాఖల అధికారులు
రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పొలం పిలుస్తోంది కార్యక్రమం అన్నిచోట్ల తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సైతం పూర్తిస్థాయిలో రాని పరిస్థితుల్లో ఇతర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఎలా వస్తారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఏ సమయంలో రైతులు ఏం చేయాలనే విషయాలు సద్వినియోపడతాయనేది వాస్తవమే అయినప్పటికీ అది ఆచరణలోకి రాని పరిస్థితి.
– అడారి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ రైతు విభాగం అత్తిలి మండల అధ్యక్షుడు
వారానికి రెండు రోజులపాటు కనీసం నాలుగు గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాలను నిర్వహించాలనే నిబంధన ఉన్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు మమ అనిపించేలా నిర్వహిస్తున్నారు. కేవలం నెలలో ఒకటో రెండో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జలవనరులు, మత్స్యశాఖ, వ్యవసాయ మార్కెటింగ్, విద్యుత్తు, సేంద్రీయ శాఖ, పశుసంవర్ధక శాఖ, జల వనరులు, ఉద్యాన, రైతు మిత్ర సంఘాలు, భూసార పరిరక్షణ శాఖ సిబ్బంది పొలం పిలుస్తోంది కార్యక్రమాల్లో హాజరై రైతులకు సలహాలు, సూచనలు అందచేయాలి. పొలం పిలుస్తోంది కార్యక్రమ సమాచారం ముందుగా ఇవ్వకుండా అప్పటికప్పుడు వెళ్లడం అక్కడ ఉన్న రైతులను గట్టుపై కూర్చోపెట్టి ఫొటో దిగి మమ అనిపించేస్తున్నారు.
మొక్కుబడిగా పొలం పిలుస్తోంది


