వర్క్ టూ రూల్ అమలు చేస్తాం
భీమవరం: సమస్యలు పరిష్కరించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ టూ రూల్ అమలు చేస్తామని అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడో రోజు నిరసన కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. తమను ఇబ్బందులకు గురి చేస్తే ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిస్తామన్నారు. 2 నెలలైనా తమ సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోనందున అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో జేఏసీ జాయింట్ సెక్రటరీ సంధ్యారాణి, వైస్ చైర్మన్ జి.జకర్యా, వీఆర్వో, వీఆర్ఏ, సర్వేయర్లు పాల్గొన్నారు.
భీమవరం: గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సీఐటీయు ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణలో మాదిరిగా పేస్కేలు అమలు చేయాలని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు, గౌరవ అధ్యక్షుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్కు వినతిపత్రం అందజేశామని అన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యకలాపాలలో క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్న వీఆర్ఏలు కనీస వేతనాలు లేక పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులలో ఉన్నారని అన్నారు. ప్రమోషన్ల పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వం ప్రమోషన్లు ఇవ్వడానికి అభ్యంతరాల పేరుతో మధ్యలోనే ఆగిపోయిందని అన్నారు. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అదనపు డ్యూటీలు కూడా వీఆర్ఏలపై మోపుతున్నారని అన్నారు. ఈ సమస్యలు పరిష్కరించమని శాంతియుతంగా అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని అన్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని ఆకివీడు, భీమవరం బ్రాంచిల పరిధిలోని సహకార బ్యాంకుల ఉద్యోగులు బుధవారం భీమవరంలోని డీసీసీబీ బ్యాంకు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ జీఓ నెం. 36 వెంటనే అమలుపరిచాలని, 2019 నుంచి 2024 పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేయాలి, అప్పటివరకు మధ్యంతర భృతి ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సిలింగ్ 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరిచి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు చేయాలన్నారు. సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులకు కూడా రిటైర్మైంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. 2019 తరువాత సహకార సంఘాలలో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు ఆరోగ్య బీమాను కల్పించాలని, ఉద్యోగి సర్వీస్లో మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 20 లక్షల టర్మ్ బీమా పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలన్నారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో అర్హులైన పేదల పిల్లలకు ఉచిత విద్య అవకాశం కల్పించడానికి నిర్దేశించిన చట్టం ప్రకారం 25 శాతం సీట్లకు 1వ తరగతిలో ప్రవేశాల కోసం అర్హులైన తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవచ్చని సమగ్రశిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే.పంకజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లోని 25 శాతం సీట్లలో ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4, బీసీలకు 6 శాతం, ఇతరులకు 5 శాతం సీట్లు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి మార్చి 10 వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
వర్క్ టూ రూల్ అమలు చేస్తాం


