పెద్దింట్లమ్మ జాతర ప్రారంభం
కై కలూరు: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర ఘనంగా బుధవారం ప్రారంభమయ్యింది. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖద్వార నిర్మాణానికి శంకుస్థాపన, ఆలయ ప్రాకార మండపం ఎదురుగా శివపార్వతుల విగ్రహాలను ప్రారంభించారు. అనంతరం గోకర్ణపురం గోకర్ణేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల చైర్మన్ భల్లం రామరాజు, ధర్మకర్తల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు. మొదటి రోజు అమ్మవారికి విఘ్నేశ్వరపూజ, పుణ్యహవాచనం, పంచామృతాభిషేకం, నూతన వస్త్ర అలంకరణ, చక్రార్చన, దూపసేవ, బాలభోగం జరిగింది. భక్తులకు ఉచిత ప్రసాదాన్ని అందించారు. వస్త్రాలంకరణ, ఉచిత ప్రసాద దాతలుగా భుజబలపట్నం గ్రామానికి చెందిన ముదునూరి రామలింగరాజు, కనుమూరి నాగ వెంకట సుబ్బరాజు, పేరిచర్ల హేమంత్ దంపతులు వ్యవహరించారు. ఈవో మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి మార్చి 3 వరకు జాతర జరుగుతుందన్నారు.


