తప్పుడు పోస్టర్ల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలి
పెనుగొండ: రాష్ట్రంలో కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి గురుప్రసాద్, మండల కన్వీనర్లు జక్కంశెట్టి శ్రీరామ్, గూడూరి దేవేంద్రుడు అన్నారు. పవిత్రమైన తిరుపతి లడ్డూపైనా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పైనా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తప్పుడు పోస్టర్లు ఏర్పాటు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆచంట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు మంగళవారం ఆచంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ అరాచక పాలన సాగుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలపైనా, మాజీ మంత్రుల ఇళ్లపైనా దాడులకు పాల్పడుతూ బీహార్ రాష్ట్రాన్ని తలపిస్తున్నారని విమర్శించారు. దాడులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆచంట సర్పంచ్ కోట సరోజనీ వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు సుంకర సీతారామ్, కోట వెంకటేశ్వరరావు, పిల్లి రుద్ర ప్రసాద్, మండ నారాయణ రెడ్డి, ముప్పాళ వెంకటేశ్వరరావు, దొమ్మేటి రాంబాబు, కోట గిరిధర్, జెంట్రీ శ్రీను, నెక్కంటి రామలింగేశ్వరరావు, బ్రహ్మేశ్వర రెడ్డి, పలివెల శ్రీను, కేతా తాతారావు, కాండ్రేగుల కనకం తదితరులు పాల్గొన్నారు.


