ఆశా వర్కర్ల ధర్నా
భీమవరం: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక 24వ వార్డు పీహెచ్సీ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి వాసుదేవరావు మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ యాప్ల ద్వారా పని భారం పెరగడంతో ఒత్తిడి తట్టుకోలేక అనేకమంది కార్యకర్తలు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీతంతోపాటు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలని, క్షేత్రస్థాయిలో వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈనెల 12న జరుగనున్న దేశ వ్యాప్త సమ్మెలో ఆశా కార్యకర్తలు పాల్గొంటారని పీహెచ్ఓకు నోటీసు అందజేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు పి రాజేశ్వరి, బి శ్రీదేవి, పి కాంతమ్మ, ఎల్వీ ఉమాదేవి, బి మరియమ్మ, బి రాగమంజరి తదితరులు పాల్గొన్నారు.


