చంద్రబాబు, పవన్కల్యాణ్లపై కేసు నమోదు చేయాలి
తణుకు అర్బన్: శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కొవ్వు పదార్ధాలు లేవని సిట్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో పంది, జంతువులు, చేప కొవ్వులు ఉన్నాయని భక్తుల మనోభావాలు దెబ్బతీసిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్ సీపీ లీగల్సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి డిమాండ్ చేశారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిట్ నివేదికలో వైఎస్సార్సీపీ నాయకుల పేర్లను చేర్చకుండా కేవలం నెయ్యి సరఫరా చేసిన యాజమాన్యాలు, అధికారుల పేర్లు చేర్చడం కూటమి శ్రేణులకు చెంపపెట్టన్నారు. కేవలం కొన్ని వెజిటబుల్స్, కెమికల్స్ కలిసినట్లుగా ఉందని ఇవ్వడంతో టీడీపీ శ్రేణులకు మింగుడుపడడం లేదని విమర్శించారు. ప్రసాద వ్యవహారంలో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని వాటన్నిటినీ మరపించేందుకే టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారని ఎద్దేవా చేశారు. అత్తిలిలో కొవ్వొత్తుల ప్రదర్శన చేసిన వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టేందుకు రెవెన్యూ అధికారులు కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని, కేసులు నమోదు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ పంచాయితీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారని కూటమి ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా దాడులు, దౌర్జన్యాలకు దిగుతుండడాన్ని ప్రజలు చూస్తున్నారని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్ పాల్గొన్నారు.


