సముద్రపు పోటు నష్ట నివారణకు చర్యలు
అంగన్వాడీ భవనాలు తక్షణం పూర్తిచేయాలి
భీమవరం: జిల్లాలో కొన్ని చోట్ల సముద్రపు నీరు ఎగదన్నడం వల్ల వరిచేలు ముంపునకు గురై రైతులు వందల ఎకరాల్లో పంటలు నష్టపోతున్నారని నష్ట నివారణకు చర్యలపై చర్చించినట్లు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అఽభివృద్ధి సమీక్షా సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. కౌలు రైతులకు పూర్తి స్ధాయి కౌలు కార్డులు ఇప్పించి ప్రభుత్వ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమీక్షా సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి చర్యలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికి ముందుగా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను గుర్తించి నూరు శాతం ఉచితంగా పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ ప్యానళ్లు అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డంపింగ్ యార్డ్లకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాలన్నారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు, రాజ్యసభ ఎంపీ పాకా సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, అరిమిల్లి రాధాకృష్ణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్
గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో చేపట్టిన పాఠశాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాలను తక్షణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. శనివారం భీమవరం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశంలో రవీంద్రనాథ్ పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ చేపట్టిన స్కూల్స్, అంగన్వాడీ భవనాల నిర్మాణాలు ప్రభుత్వం మారడంతో నిలిచిపోయాయని వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని నొక్కి చెప్పారు. సమావేశంలో పరిశ్రమల సబ్జెక్ట్ను ఎందుకు చేర్చలేదని నిలదీశారు. గత ఏడాదిలో చిన్న, మధ్య, భారీ పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వ రాయితీలు క్రమ పద్ధతిలో విడుదల చేశారా ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సివుంది, ఎప్పడు ఇచ్చే అవకాశం ఉందని ప్రశ్నలు సందించారు. స్పందించిన ఇన్చార్జ్ మంత్రి నిలిచిపోయిన స్కూల్స్, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూస్తున్నామని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.


