రాయల్ కిరణ్ నోరు అదుపులో పెట్టుకోవాలి
వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి
ఏలూరు టౌన్: కూటమి నేతల ప్రోద్భలంతో కిరణ్ రాయల్ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను తీవ్ర పదజాలంతో కించపరిచే వ్యాఖ్యలు చేశాడని, నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదుండి సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బీసీ సెల్ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. బీసీలు, యాదవులకు వైఎస్సార్సీపీ అధినేత అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే అక్కసుతో యాదవులను అణచివేయాలనే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని యాదవులకు కేటాయించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది కాదా? అని ప్రశ్నించారు. బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి మాట్లాడుతూ... రాయల్ కిరణ్ చేసిన వ్యాఖ్యలను బీసీ సంఘాలన్నీ ఖండిస్తున్నాయని, వైఎస్సార్సీపీ నేతలను ఇష్టారాజ్యంగా తిడుతూ మళ్ళీ పార్టీలో చోటు సంపాదించాలనే కుటిల రాజకీయాలు చేయటం మానుకోవాలన్నారు. కూటమి నేతలు ఇకనైనా అరాచకాలు, దాడులు, కించపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని లేదంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కిలారు బుజ్జి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, పలువురు బీసీ సెల్ నేతలు హాజరయ్యారు.


