అంబటి రాంబాబుపై దాడి దారుణం
నరసాపురం: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు నివాసంపై దాడి దారుణమని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలపై అధికారపక్షం దాడులకు దిగడం సమంజసం కాదన్నారు. ఇలాంటి విష సంస్కృతి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని పేర్కొన్నారు. అంబటి నివాసంపై పార్టీ శ్రేణులను ఉసిగొల్పి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో దుష్ట సంస్కృతిని ప్రోత్సహించడం తగదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయం చంద్రబాబుకు తెలియని విషయం కాదన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో అరాచక పాలన
తాడేపల్లిగూడెం: కూటమి పాలన అరాచకంగా మారిందని వైఎస్సార్సీపీ గూడెం కన్వీనర్ వడ్డి రఘురాం ధ్వజమెత్తారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అంబటి రాంబాబు నిజాలు మాట్లాడుతున్నారని ఆయన ఇంటిమీద దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని ప్రభుత్వం మర్చిపోకూడదన్నారు. జగన్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు సంయమనంతో వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ దాడిని కాపులపై జరిగిన దాడిగా భావించాలా... ఒక పెద్ద సామాజిక వర్గానికి ఇచ్చే మర్యాద ఇదేనా అన్నారు. కూటమి ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక పచ్చమూకలు ఇలాంటి దాడులు చేస్తున్నాయన్నారు.
అంబటి రాంబాబుపై దాడి దారుణం


