రెడ్డి కులస్తులకు మంత్రి ఆనం క్షమాపణ చెప్పాలి
పెంటపాడు: రెడ్డి కులస్తులకు రాష్ట్ర దేవాదాయశాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి క్షమాపణలు చెప్పి, ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్సీడీఎస్ సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు. పెంటపాడులో రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ (ఆర్సీడీఎస్) సమావేశం శనివారం నిర్వహించారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి విజయానందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కర్రి శ్రీనివాసరెడ్డి, మహిళా జిల్లా అధ్యక్షురాలు పోతంశెట్టి లక్ష్మి మాట్లాడుతూ రెడ్డి కులస్తులకు ప్రభుత్వ పథకాలు కట్ చేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రెడ్డి కులస్తులలలో ఎంతో మంది పేదలు ఉన్నారన్నారు. అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్న రీతిగానే రెడ్డి కులస్తులకు కూడా అందాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కర్రి సురేష్రెడ్డి, వెలగల లింగారెడ్డి, సింగారెడ్డి, శ్యాం సుందర్రెడ్డి, బేతిరెడ్డి వరప్రసాద్రెడ్డి, కర్రి శివాజీరెడ్డి, గూడెం నియోజకవర్గ ఆర్సీడీఎస్ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: ఏపి నిట్ ఏర్పడిన తర్వాత 2015–19, 2016–2020 పాస్డ్ అవుట్ బ్యాచ్ విద్యార్థులు శనివారం నిట్ ప్రాంగణంలో తొలి ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఆనాటి మధుర స్మృతులను నెమరవేసుకుని ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నిట్ రిజిస్ట్రార్ పి.దినేష్ శంకరరెడ్డి మాట్లాడుతూ పరిశోధన, విద్యాసంబంధమైన విషయాలలో సంస్థకు పూర్వ విద్యార్థులు సహకరించాలన్నారు. ఏపి నిట్ డీన్ స్టూడెంట్స్ కెరీర్, అలుమ్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ జీబి.వీరేష్కుమార్ మాట్లాడుతూ పూర్వవిద్యార్థులను కలిసినందుకు ఆనందంగా ఉందన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ నిట్లో అభ్యసించిన విద్య, నేర్చుకున్న క్రమశిక్షణ తమకు అక్కరకు వచ్చి, ఉన్నత స్థాయికి చేరడానికి దోహదపడ్డాయన్నారు. అనంతరం గురువులను సత్కరించారు. అసోసియేట్ డీన్, ఆచార్యులు డాక్టర్ సుదర్శన్ ఽధ్రువ, సహ సమన్వయకర్తగా వ్యవహరించారు. డీన్లు డాక్టర్ కిరణ్ శాస్త్రి, వి.సందీప్, ఎన్.జయరామ్, కార్తీక్ శేషాద్రి, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: రథసప్తమి వేడుకలకు శ్రీవారి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. అందులో భాగంగా ఆదివారం నిర్వహించనున్న స్వామి, అమ్మవార్ల తిరువీధి సేవలకు వినియోగించే సూర్య, చంద్ర ప్రభ వాహనాలను ఆలయ సిబ్బంది శనివారం ముస్తాబు చేశారు. ముందుగా వాహన శాల నుంచి తీసుకొచ్చిన సూర్య, చంద్ర ప్రభ వాహనాలను ఆలయ ఆవరణలో ఉంచారు. అనంతరం వాటిని శుభ్రం చేశారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 7 గంటల నుంచి స్వామి, అమ్మవార్లకు సూర్య ప్రభ వాహనంపై, అలాగే రాత్రి 7 గంటల నుంచి చంద్ర ప్రభ వాహనంపై తిరువీధి సేవలను కన్నులపండువగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.
రెడ్డి కులస్తులకు మంత్రి ఆనం క్షమాపణ చెప్పాలి
రెడ్డి కులస్తులకు మంత్రి ఆనం క్షమాపణ చెప్పాలి


