ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మొండిచేయి
భీమవరం: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ ఇవ్వకుండా దగా చేస్తుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్ప రాజ్ మండిపడ్డారు. భీమవరంలో ఆయన మాట్లాడుతూ బడా బాబులకు పరిహారాలు చెల్లించి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మాత్రం మొండిచేయి చూపుతున్నారన్నారు. దళిత పారిశ్రామికవేత్తలకు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వకుండా, పరిశ్రమల మంత్రి టీజీ భరత్ తన కుటుంబానికి చెందిన కంపెనీలకు భారీ మొత్తంలో కోట్లలో విలువైన ప్రోత్సాహకాలు విడుదల చేసుకోవడం బాధ కలిగించేలా ఉందన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు నేతల సువర్ణరాజు, ఇంటి సుందర్ కుమార్, కొలాటి ప్రసాద్ రావు, చిగురుపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
తణుకు అర్బన్: శివాలయంలో బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైన ఘటన తణుకు మండలం కొమరవరంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలో అమ్మవారి సూత్రాలు, ముక్కుపుడక వగైరా 2 కాసుల బంగారు ఆభరణాలు, స్వామివారి వెండి తొడుగులైన 5 కిలోలకుపైగా వెండి ఆభరణాలు దోచుకున్నారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ ఘటనా ప్రాంతానికి వచ్చి పర్యవేక్షించారు. క్లూస్ టీమ్తోపాటు డాగ్ స్క్వాడ్ పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
ఉండి: భర్తపై భార్య పెట్టిన రెండు కేసుల్లో కోర్టు శిక్ష విధించింది. ఉండి ఎస్సై నసీరుల్లా తెలిపిన వివరాల ప్రకారం 2019లో ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారానికి చెందిన కోట కనకమహాలక్ష్మీ తన భర్త ఆంజనేయులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ కేసు పెట్టింది. ఈ కేసులో శుక్రవారం అతనికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించారు. అదే ఏడాది తన భర్తపై పెట్టిన మరో కేసులో ఏడాది జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు.


