పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి
తణుకు అర్బన్: పారిశ్రామికంగా జిల్లా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రీయల్ పార్క్స్ పాలసీ అమల్లో భాగంగా నిర్వహించిన ఎంఎస్ఎంఈ ప్రైవేట్ ఇండస్ట్రీయల్ పార్క్స్ డెవలప్మెంట్ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ భూముల కొరత ఉందన్నారు. పరిశ్రమ స్థాపన ఆలోచన ఉన్న యువతకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ప్రైవేటు భూములు కలిగిన యాజమాన్యాలు ముందుకు వస్తే ప్రైవేటు పారిశ్రామిక వాడల అభివృద్ధికి అడుగులు పడతాయన్నారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఆర్డీఓ ఖతీబ్ కౌసల్భానో, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతిరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.బాబ్జి, మున్సిపల్ కమిషనర్ టి.రామ్కుమార్, తహసీల్దార్ దండు అశోక్ వర్మ పాల్గొన్నారు.
యూరియా వాడకాన్ని తగ్గించాలి
రైతులు అవసరం మేరకే యూరియా వినియోగించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. వేల్పూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సభ్యులు డివిడెండ్, వడ్డీ రాయితీ పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగానే ఎక్కువ యూరియా వినియోగించే జిల్లాల్లో ప్రముఖంగా పశ్చిమగోదావరి కనిపిస్తోందని, యూరియా వాడకాన్ని తగ్గించాలన్నారు. అనంతరం సొసైటీ గోడౌన్లలో నిల్వలను పరిశీలించారు.
భీమవరం అర్బన్: పట్టాదారు పాస్ పుస్తకాల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. గురువారం యనమదుర్రు గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామ సచివాలయంలో రైతులతో మాట్లాడారు. రీ సర్వే పూర్తయిన యనమదుర్రులో వచ్చేనెల 2 నుంచి 9 వరకు కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. వీటిని సరిచూసుకుని తప్పులుంటే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఆర్డీఓ కె.ప్రవీణ్కుమార్రెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, వీఆర్వో నాగరాజు సర్పంచ్ బూరాబత్తుల రామమూర్తి, రైతులు పాల్గొన్నారు.
సమన్వయంతో గణతంత్ర వేడుకలు
భీమవరం (ప్రకాశంచౌక్): భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ ఆదేశించారు. వేడుకల నిర్వహణ, కలెక్టరేట్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లు, శకటాల ప్రదర్శన తదితర అంశాలపై గురువారం గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు.
భీమవరం: భీమవరంలోని డీఎన్నార్, విష్ణు ఇంజనీరింగ్ కళాశాలల్లో గురువారం జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు 300 మందికి నలుగురు గైర్హాజరయ్యారు. డీఎన్నార్ ఇంజనీరింగ్లో 200 మందికి 197 మంది, విష్ణు ఇంజనీరింగ్లో 100 మందికి 99 మంది హాజరయ్యారు.
చాట్రాయి: అన్నదమ్ముల మధ్య ఏర్పడిన భూమి వివాదంలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని చోటుచేసుకుంది. ఎస్సై డి.రామకృష్ణ కథనం మేరకు మండలంలోని కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన పండు తిరుపతి దాసు, అన్న రామచంద్రయ్య మధ్య భూవివాదం నెలకొంది. మూడు నెలల క్రితం వివాదంలో ఉన్న 90 సెంట్ల భూమిలో తమ్ముడు తిరుపతిదాసు మామిడి మొక్కలు నాటాడు. గురువారం రామచంద్రయ్య కుటుంబసభ్యులు ఈ మామిడి మొక్కలను నరుకుతుండగా తిరుపతిదాసు, అతడి భార్య బేబి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు వారిని 108లో విస్నన్నపేట ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు.
దెందులూరు: మండలంలోని జోగన్నపాలేనికి చెందిన అంతర్జాతీయ ఐస్ స్కేటర్ జెస్సీరాజ్ మత్రాపు ఖేలో ఇండి యా వింటర్ గే మ్స్– 2026లో రజత పతకం సాధించింది. లడక్లో ఈనెల 20 నుంచి పోటీలు జరుగుతున్నాయి. జెస్సీరాజ్ సీనియర్ గరల్స్ ఫిగర్ స్కేటింగ్ కేటగిరీలో రెండో స్థానంలో నిలిచింది.


