కాలుష్య కాసారం
మరో ఉద్దానంలా మారుతోంది
సాగునీరు అందడం లేదు
చర్యలు తీసుకోవాలి
నరసాపురం: నరసాపురం నియోజకవర్గంలో ప్రధానమైన వేములదీవి కాలువ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. సుమారు 40 వేల మంది ఈ నీటిని వివిధ అవసరాలకు వాడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కలుషిత నీటినే తాగాల్సి వస్తోంది. మరోవైపు కాలువను బాగు చేయకపోవడంతో సుమారు 6 వేల ఎకరాల ఆయకట్టు రైతులు అవస్థలు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా.. స్థానిక ఎమ్మెల్యే గానీ, అటు ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గానీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి లక్ష్మణేశ్వరం, రాజుల్లంక, దర్బరేవు, మర్రితిప్ప, వేములదీవి, బియ్యపుతిప్ప వరకూ 7 కిలోమీటర్లు మేర ఈ చానల్ ప్రవహిస్తుంది. 10 పంచాయతీలకు ఈ కాలువ నీరే ఆధారం.
అడుగడుగునా.. కాలుష్య జాడలే
పట్టణంలో డ్రెయినేజీ నీరంతా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ కాలువలోనే కలుస్తుంది. వేలముదీవి చానల్ గ్రామాల వారు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పీచుపాలెంలో చేపల, రొయ్యల విక్రయాలు జరుగుతాయి. వాటి వ్యర్థాలు ఈ కాలువలోనే కలుపుతున్నారు. లక్ష్మణేశ్వరంలో టీడీపీ పెద్దలకు చెందిన సంధ్య మైరైన్ రొయ్యల ఫ్యాక్టరీ వ్యర్థాలు ఈ కాలువలోనే కలుపుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ స్కీంల ద్వారా ఈ నీటిని శుద్ధి చేయకుండానే తాగునీటిగా సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ గ్రామాల్లో కిడ్నీ వ్యాధుల బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే.. ఎమ్మెల్యే నాయకర్ ఎక్కడున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాలువ మొత్తం గుర్రపు డెక్కే :
కాలువ పొడవునా గుర్రపు డెక్క, చెత్తతో నీరు పారడం లేదు. దీంతో 6 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలువను బాగుచేయలేదు. రెండేళ్ల క్రితం వైఎస్సార్సీపీ హయంలో బాగుచేశారు. మోంథా తుఫాన్ సమయంలో కాలువ పొడవునా అనేక చోట్ల చెట్లు కూలి కాలువలో పడిపోయాయి. వాటిని తొలగించే చర్యలు చేపట్టలేదు.
వేములదీవి కాలువలో కలుస్తున్న వ్యర్థాలు, మురుగునీరు
ఆ నీటినే తాగుతున్న 40 వేల జనాభా
కాలువలో నీరు పారక రైతుల అవస్థలు
ప్రజాపతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం
వేములదీవి చానల్ పొడువునా 40 వేలమంది జనాభాకు ఈ కాలువ ద్వారానే తాగునీరు సరఫరా అవుతుంది. విషపు నీటిని మా గ్రామాల ప్రజలు తాగాల్సి వస్తోంది. ఈ గ్రామాల్లో ఇటీవల కిడ్నీ బాధితులు బాగా పెరుగుతున్నారు. కాలుష్య నీటిని తాగడం వల్లేనని వైద్యులు చెబుతున్నారు. కాలువ బాగు చేయకపోతే మా గ్రామాలు మరో ఉద్దానంలా తయారవుతాయి.
– ముదునూరి మార్రాజు, రాజుల్లంక మాజీ సర్పంచ్
6 వేల ఎకరాల ఆయకట్టుకు ఈ కాలువ ద్వారానే నీరు అందాలి. గుర్రపు డెక్క, చెత్త పేరుకుపోయింది. అసలు ఇక్కడ కాలువ ఉన్నట్లు తెలియడం లేదు. ఎప్పుడో రెండేళ్ల క్రితం కాలువను బాగు చేశారు. మళ్లీ అతీగతీ లేదు. నరసాపురం పట్టణంలోని డ్రెయినేజీ నీరంతా ఈ కాలువలోనే కలుస్తుంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు.
– అయితంపూడి బాపిరాజు, రైతు
వేములదీవి చానల్ కాలుష్యంపై అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేశాం. ఎవరూ పట్టించోవడంలేదు. ప్రజల ఆరోగ్యం, రైతుల బాగోగులు పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవహరించడం దారుణం. అన్ని వ్యర్థాలు ఈ కాలువలోనే కలిపేస్తున్నారు. సంధ్య మైరెన్స్ వ్యర్థాలు కాలువలో కలిపేస్తున్నా కూడా వారిని నియంత్రించే ధైర్యం అధికారులకు లేదు.
–బిళ్లు సత్యనారాయణ, వైఎస్సార్సీపీ నేత
కాలుష్య కాసారం
కాలుష్య కాసారం
కాలుష్య కాసారం
కాలుష్య కాసారం


