
ఖైదీల్లో పరివర్తన.. నైపుణ్య శిక్షణ
ఏలూరు (మెట్రో) : సీసీసీ పేరుతో కస్టడీ, కేర్, కరెక్షన్ పేరుతో జైళ్ల శాఖ ఖైదీల పట్ల అనేక సేవలు అందిస్తుంది. వివిధ రకాల నేరాలు చేసి జైలు శిక్షకు వచ్చిన వారి పట్ల ఉదార స్వభావంతో అధికారులు వ్యవహరించి వారి మానసిక, శారీరక స్థితిగతులను బేరీజు వేసుకుంటారు. వారి నేరప్రవత్తి మార్చేందుకు జైలు అధికారులు ప్రతి ఒక్కరికీ కౌన్సెలింగ్, గ్రూప్ కౌన్సెలింగ్ వంటివి నిర్వహించి తద్వారా వారిలో మార్పు సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా నిరంతరం యోగా సాధనతో ఖైదీలకు తమ దైనందిక జీవితంలో మార్పులు తీసుకొచ్చేందుకు సైతం జైళ్ల సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ఖైదీలతో పాటు, సిబ్బందిని సమన్వయం చేస్తూ జిల్లా సబ్జైళ్ల అధికారి, జిల్లా జైల్ సూపరింటెండెంట్ సీహెచ్ ఆర్వీ స్వామి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇలా..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా జైలు, భీమవరం స్పెషల్ సబ్జైలు, చింతలపూడి సబ్జైలు, తణుకు సబ్జైల్, నరసాపురం సబ్జైల్, పోలవరం సబ్జైల్లు ఉన్నాయి. జైళ్లలో ఖైదీలకు వారి నైపుణ్యాలను ఆధారంగా ప్రస్తుతం మూడు రకాల వేతనాలను అందిస్తున్నారు. పనిలో ఏ నైపుణ్యం లేని వారికి రోజుకు రూ.160, తక్కువ నైపుణ్యం కలిగిన వారికి రూ.180, నైపుణ్యం కలిగిన వారికి రూ.200 ఇస్తున్నారు. పెట్రోల్ బంక్లో పని చేసే వారికి రూ.200, ముద్దాయిల అంగీకారంతో కిచెన్, క్లీనింగ్, తదితర పనులు చేసే వారికి రోజుకు రూ.160 రూపాయలు ఇస్తూ వారు జైలు శిక్ష అనంతరం వారి భవిష్యత్కు భరోసా ఇచ్చేందుకు జైళ్లశాఖ చర్యలు తీసుకుంటుంది.
కఠిన శిక్షలే కాదు... అనేక నేరాలు చేసి వచ్చిన వారిలోనూ సత్ప్రవర్తన తీసుకొచ్చేందుకు తీవ్రంగానే శ్రమిస్తారు. కరుడు కట్టిన నేరస్తులైనా జైలులోకి వచ్చిన తరువాత వారి చేసిన నేరాలు పక్కన పెట్టి వారిలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తారు. ఏదో క్షణికావేశంలో చేసిన నేరానికి ఖైదీలు జీవితాన్నే కోల్పోవాల్సిన పరిస్థితి. ఆ జీవితాన్ని కోల్పోకుండా శిక్షానంతరం వారి బంగారు భవితకు బాటలను వేస్తున్నారు జైళ్ల శాఖ అధికారులు. నేడు ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
నేర ప్రవృత్తి మార్చేందుకు కృషి
శిక్షానంతరం భవిష్యత్కు బాటలు
జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు
నేడు ఖైదీల సంక్షేమ దినోత్సవం