
టెంపుల్ జాగా.. ప్రైవేట్ పరం దిశగా
రూ.3 కోట్లతో అభివృద్ధి
ప్రభుత్వంలోనే ఉండాలని..
చంద్రబాబే ప్రైవేట్ మనిషి
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం పర్యాటకులకు మెరుగైన సేవలు అందించాలనే మంచి ఉద్దేశ్యం, లక్ష్యంతో రెండు దశాబ్దాల క్రితం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు అతి తక్కువ ధరకు విక్రయించిన కోట్లాది రూపాయల విలువైన భూమి ఇప్పుడు ప్రైవేట్ పరం కానుందా.. అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలోని పర్యాటక అభివద్ధి సంస్థ (ఏపీటీడీసీ) యూనిట్లను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోంది. దాంతో ద్వారకాతిరుమల శ్రీవారి కొండపై ఉన్న హరిత హోటల్, అది ఉన్న భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనుంది. అదే జరిగితే గోవిందుడి భూమిలో ప్రైవేట్ వ్యాపారం జరగడం ఖాయం. వివరాల్లోకి వెళితే. టెంపుల్ టూరిజంలో భాగంగా శ్రీవారి దేవస్థానం సుమారు 2 ఎకరాల భూమిని 23 ఏళ్ల క్రితం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు విక్రయించింది. ప్రభుత్వ సంస్థ కావడం, భక్తులకు సౌకర్యాలు కలుగుతాయన్న ఉద్దేశ్యంతో అప్పట్లో నామమాత్రపు ధరకు భూమిని దేవస్థానం అమ్మింది.
కోటిన్నరతో హోటల్ నిర్మాణం..
సుమారు రూ.1.50 కోట్లతో నిర్మించిన ఈ హోటల్ను 2002 డిసెంబర్ 19న ప్రారంభించారు. పర్యాటకులు, సామాన్య భక్తులు ఈ హోటల్లోని గదులు, రెస్టారెంట్, ఫంక్షన్ హాల్స్ను వినియోగిస్తున్నారు. అయితే 7 ఏళ్ల క్రితం టీడీపీ హయాంలోనే ఈ హోటల్తో పాటు, మరికొన్ని హోటళ్లను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించగా, అప్పటి శ్రీవారి దేవస్థానం అధికారులు తమ భూమిలో ఉన్న హోటల్ను తమకే అప్పగించాలని టూరిజం శాఖ అధికారులను కోరారు. దాంతో ప్రైవేటీకరణ అంశానికి తాత్కాలికంగా తెరపడింది. మళ్లీ చంద్రబాబు సీఎం కావడంతో తాజాగా ప్రైవేటీకరణ అంశం తెరమీదకొచ్చింది. ఈ సారి ఏకంగా 33 ఏళ్ల లీజుకు ఈ హరితా హోటళ్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం శరవేగంగా జరుగుతోంది.
ప్రైవేట్కి ఇస్తే.. క్షేత్రాల పవిత్రతకు ముప్పే
ద్వారకాతిరుమల, శ్రీశైలం క్షేత్రాల్లో కొండపై ఉన్న ఈ హరిత హోటళ్లను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే సామాన్య భక్తులకు వాటి ధరలు అంబాటులో ఉండవు. అలాగే మద్యం, మాంసాల వినియోగంతో పాటు, అసాంఘిక కార్యకలాపాలు జరిగి, క్షేత్ర పవిత్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఆలయాల పరిసరాల్లో ఉన్న హరితా హోటళ్లను ఆ దేవస్థానాలకే లీజుకు ఇచ్చి, వాటి నుంచి ప్రభుత్వం ఆదాయాన్ని పొందాలని పలువురు అంటున్నారు.
ఉద్యోగుల్లో ఆందోళన..
రాష్ట్ర వ్యాప్తంగా హరితా హోటళ్లలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, రోజూవారీ పద్ధతిన 1,300 మంది పనిచేస్తున్నారు. హోటళ్లను ప్రైవేటీకరణ చేస్తే దాదాపు 25 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీకి, ఎండీ అమ్రాపాల్కు అర్జీలను అందించారు. అలాగే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు కోరారు. టూరిజం ఉద్యోగులు గురువారం విజయవాడ ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈవో వివరణ
కొండపైన దేవస్థానం స్థలంలో టూరిజం హోటల్ నిర్మించి, అభివృద్ధి చేశారని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి వివరణ ఇచ్చారు. అయితే అప్పట్లో ఆ స్థలాన్ని టూరిజం శాఖకు ఎంతకు విక్రయించారు, ఏమి జరిగిందనే విషయాలను తాను కూడా తెలుసుకోవాల్సి ఉందన్నారు.
ద్వారకాతిరుమల కొండపైన హరిత హోటల్
హోటల్ వెనుక రూ. కోటితో నిర్మించిన కల్యాణ మండపం
స్థానిక హరిత హోటల్లో 8 డీలక్స్, 8 ఏసీ స్టాండర్డ్, 2 నాన్ ఏసీ రూములు, ఒక రెస్టారెంట్, మినీ ఫంక్షన్ హాల్ ఉండేది. వాటిని మరింత అభివృద్ధి చేసేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులను మంజూరు చేయగా, ఆ నిధులతో ఏడాదిన్నర క్రితం హోటల్లో అన్ని సౌకర్యాలను సమకూర్చారు. క్షేత్రంలో కల్యాణ మండపాలకు మంచి డిమాండ్ ఉండటంతో సుమారు కోటి రూపాయలు వెచ్చించి, ఒక పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్ను నిర్మించారు. ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే రూ. 3 కోట్లు ఖర్చు వృథా అయినట్టే.
ప్రైవేటీకరణకు సిద్ధంగా ఏపీటీడీసీ యూనిట్లు
అందులో ద్వారకాతిరుమల కొండపైన హరిత హోటల్ ఒకటి
పర్యాటకుల సౌకర్యార్థం 23 ఏళ్ల క్రితం హోటల్ నిర్మాణానికి.. స్వల్ప ధరకు భూమిని విక్రయించిన శ్రీవారి దేవస్థానం
ఇప్పుడు భవనంతో పాటు ప్రైవేట్ పరం కానున్న గోవిందుడి భూమి
ప్రైవేట్కి ఇస్తే క్షేత్రానికి ముప్పు.. ఆపై సామాన్యులకు ఇబ్బందులు
మేము ప్రభుత్వంలోనే ఉండాలని కోరుకుంటున్నాం. హరిత హోటళ్లు, రిసార్ట్స్ను ప్రైవేటీకరణ చేస్తున్నారని తెలిసి ఇప్పటికే మా ఉన్నతాధికారులను కలిశాం. మాకు ఏ ఇబ్బంది ఉండదని చెప్పారు. ద్వారకాతిరుమల హరిత హోటల్లో 9 మంది పనిచేస్తున్నాం. నేను 20 ఏళ్ల క్రితం నుంచి పనిచేస్తున్నాను.
– పి.అచ్యుతకుమార్, హరిత హోటల్ కాంట్రాక్ట్ ఉద్యోగి, ద్వారకాతిరుమల
సీఎం చంద్రబాబే ప్రైవేట్ మనిషి. ఆయనకు కావాల్సిన వారికి టూరిజం హోటళ్లు, రిసార్ట్స్లను తక్కువ లీజుకు కట్టబెట్టేందుకు చూస్తున్నారు. టెంపుల్ టూరిజంను ఎప్పుడూ ఆదాయ వనరుగా చూడకూడదు. పర్యాటకుల సౌకర్యాల కల్పనపైనే దృష్టి పెట్టాలి. హోటళ్లు, రిసార్ట్స్ను ప్రైవేట్ పరం చేస్తే ఇంక టూరిజం శాఖ దేనికి, దానికి మంత్రి, అధికారులు ఎందుకు. కొండపైన ప్రైవేట్ వ్యక్తులకు హోటళ్లు నిర్వహణ అవకాశాలు కల్పిస్తే క్షేత్ర పవిత్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
– పాకలపాటి త్యాగ భీమేశ్వరరావు, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గం మేధావుల ఫోరం అధ్యక్షుడు

టెంపుల్ జాగా.. ప్రైవేట్ పరం దిశగా

టెంపుల్ జాగా.. ప్రైవేట్ పరం దిశగా

టెంపుల్ జాగా.. ప్రైవేట్ పరం దిశగా

టెంపుల్ జాగా.. ప్రైవేట్ పరం దిశగా

టెంపుల్ జాగా.. ప్రైవేట్ పరం దిశగా