
గ్యాంబ్లింగ్ హబ్గా ‘గూడెం’
బియ్యం అక్రమ రవాణాలో గూడెం క్రియాశీలకం
మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం
తాడేపల్లిగూడెం అర్బన్ : కూటమి ప్రభుత్వ హయాంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని గ్యాంబ్లింగ్ హబ్గా మార్చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఏ వీధిలో చూసినా బెల్టు దుకాణాలు, ఎక్కడ చూసినా జూదం, కోడి పందేలు, పేకాట.. ఇక గూడెంను ఏం చేద్దామనుకుంటున్నారు.. అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధికి చెందినవారు వేసిన ఇసుక కొండల నుంచే అధిక ధరకు ఇసుక కొనుగోళ్లు చేయాలంటూ లారీ డ్రైవర్లపై బెదిరింపులకు పాల్పడతున్నారని విమర్శించారు. షాడోలు, షాడోల వారసుల ముసుగులో నియోజకవర్గంలో అక్రమ దందాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అనుమతులతో మట్టి తవ్వకాలు చేస్తున్నవారిని సైతం బెదిరించి.. ఇక్కడి నేతల అనుమతి తీసుకోవాల్సిందే అంటూ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు.
రైతుల సమస్యలపై చిత్తశుద్ధి ఏదీ?
డెల్టా ప్రాంతంలో అకాల వర్షాలకు పంటలు మునిగిపోతే ఆయా రైతుల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదని కొట్టు సత్యనారాయణ విమర్శించారు. కాలువల్లో పూడుకుపోయిన తూడును తొలగించారా అని ప్రశ్నించారు. పంట మునిగిన రైతులకు కాకుండా ఎగువ ప్రాంత రైతులకు పరిహారం అందిస్తారా అంటూ నిలదీశారు. యూరియా కొరత వస్తుందని ముందే గమనించి.. స్థానిక కూటమి నేతలు భారీస్ధాయిలో గోదాముల్లో యూరియా నిల్వ చేశారని ఆయన విమర్శించారు. వాటిపై తనిఖీల కోసం విజిలెన్స్ సీఐ నేతృత్వంలో వచ్చిన బృందాన్ని తనిఖీలు చేయనివ్వకుండా ఎవరు ప్రభావితం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పడమరవిప్పర్రు గ్రామంలో యూరియా బస్తా రూ.400కు మించి అమ్ముతుంటే వ్యవసాయాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మద్యం బాటిల్కు ఎంఆర్పీ కంటే అధికంగా పది రూపాయలు, డాబాలలో అదనంగా 40 రూపాయలు వసూలు చేస్తూ విక్రయాలు చేస్తుంటే ఎకై ్సజ్ అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. వేరే పార్టీల వారు అధికార పార్టీలో చేరితే విచ్చలవిడిగా జూదం ఆడించుకోవచ్చా అని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున కోడి పందేలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కాకినాడ బియ్యం అక్రమ రవాణాలో తాడేపల్లిగూడెం క్రియాశీలకంగా ఉందంటున్నారని, దీనికి సూత్రధారులు ఎవరని ప్రశ్నించారు. రాష్ట్ర మీడియాలో సైతం ఇక్కడి అక్రమాలను ప్రత్యేక కథనాలతో వెలికితీస్తోందని, వీటిపై జిల్లా పర్యవేక్షణాధికారిగా ఉన్న కలెక్టర్ పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు.
తాము అఽధికారంలో ఉండగా, శాంతిభద్రతలను అదుపులో ఉంచి, మహిళలకు రక్షణ కల్పించలేదా అన్నారు. ట్రాఫిక్ పద్మవ్హూహ సమస్య పరిష్కారానికి రెండో ఫ్లెవోవర్ వంతెనను చేతిలో ఫైల్స్ పట్టుకొని సెక్రటేరియట్, మంత్రుల చుట్టూ తిరిగి నిర్మిస్తే, ఏదో బిల్డింగ్ కట్టుకున్నానని మాట్లాడుతున్నారు. ఇటీవల ఈ ప్రభుత్వం మూడు వంతెనలను 200కోట్లతో నిర్మిస్తున్నామంటున్నారు. వారు ఏం చేస్తారో. నెత్తిమీద పదిరూపాయలు పెడితే పది పైసలకు పలుకని నాయకులతో నకిలీ ప్రెస్మీట్లు పెడుతుంటారు. ఏంటి ఈ విధానం అన్నారు. కాకినాడ బియ్యం అక్రమ రవాణాలో గూడెం క్రియాశీలకంగా ఉందంటున్నారు. ఎవ్వరు దీనికి సూత్రధారులన్నారు. రాష్ట్ర మీడియా ఇక్కడి విషయాలపై ప్రత్యేక కధనాలను ప్రచురిస్తున్నాయి. జిల్లా పర్యవేక్షణాధికారిగా ఉన్న కలెక్టర్ ఇలాంటి విషయాలను పట్టించుకోవాలి కదా అన్నారు. నియోజకవర్గంలో రౌడీయిజం, నాన్ లేఅవుట్ల దందా పెరిగిపోయిందన్నారు. అధికారం చేతిలో ఉందని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు వాస్తవాలను గుర్తించి కూటమి నేతలను తిరస్కరించడానికి ఎంతో కాలం పట్టదన్న విషయాలను గమనించాలని హెచ్చరించారు. రైతులకు ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉండటానికి వైఎస్సార్సీపీ ముందు వరుసలో ఉంటుందన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం చేపట్టిన కార్యక్రమం విజయవంతం చేయాలని, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.