
రూ.15 కోట్ల బిల్లులు పెండింగ్
నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్న మెస్ నిర్వాహకులకు రూ.కోట్ల మెస్ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తుండంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. నెలల తరబడి మెస్ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేయడంతో.. అప్పుల పాలవుతున్నామని లబోదిబోమంటున్నారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లోని మెస్ నిర్వాహకులకు దాదాపు రూ.15 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీనిపై నిర్వాహకులు పలుమార్లు ఆర్జీయూకేటీ అధికారులను కలిసి బిల్లులు విడుదల చేయాలని విన్నవించుకున్నా రూపాయి కూడా విడుదల చేయడం లేదు. దీంతో జూలై 1 నుంచి వేసవి సెలవుల అనంతరం ట్రిపుల్ ఐటీల్లో తరగతులు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో మెస్ల నిర్వహణ ఎలా అని తలలు పట్టుకుంటున్నారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఉన్న 26,400 మంది విద్యార్థులకు 11 మంది మెస్ నిర్వాహకులు భోజనాన్ని తయారు చేసి అందజేస్తున్నారు. ఈ మెస్లలో కొన్నింటికి గతేడాది సెప్టెంబరు నుంచి మరికొన్నింటికి నవంబరు నుంచి, ఇంకొన్నిటికి జనవరి నుంచి ట్రిపుల్ ఐటీలకు వేసవి సెలవులు ఇచ్చే నాటి వరకు మెస్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రతి రోజూ ఒక్కొక్క మెస్ కనిష్టంగా 2 వేల మంది నుంచి 6 వేల మందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం, సాయంకాలం స్నాక్స్ అందిస్తోంది. ఇంత భారీ మొత్తంలో మెస్లు నిర్వహిస్తున్న వీరికి పెట్టుబడి సైతం ఎక్కువగానే ఉంటుంది. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి సరుకులు తెచ్చి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వండి పెడుతున్నారు. అయినప్పటికీ ఆర్జీయూకేటీ అధికారులు మెస్ నిర్వాహకులకు బిల్లులు సకాలంలో చెల్లించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు.
ట్రిపుల్ ఐటీల మెస్ నిర్వాహకుల గగ్గోలు
బిల్లుల అప్లోడ్లో తీవ్ర జాప్యం
నెల గడవగానే ఆ నెలకు సంబంధించిన బిల్లులను సీఎంఎఫ్ఎస్లో అప్లోడ్ చేయడంలో ట్రిపుల్ ఐటీల సిబ్బంది తీవ్ర జాప్యం చేస్తున్నారని మెస్ నిర్వాహకులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఈ బిల్లుల అప్లోడ్ బాధ్యతలను అవుట్ సోర్సింగ్ స్టాఫ్కు అప్పగించడంతో వారు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆరు నెలలు, ఎనిమిది నెలల పాటు బిల్లులు చెల్లించకపోవడంతో మెస్ నిర్వాహకులు కోట్లాది రూపాయల అప్పుల్లో మునిగిపోయారు. నూజివీడు ట్రిపుల్ఐటీలో కేఎంకే సంస్థకు దాదాపు రూ.2.50 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో రూ.1.75 కోట్లు, ఎస్ఎస్ క్యాటరర్స్కు రూ.2.10 కోట్లు, ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఫుడ్సూత్ర హాస్పటాలిటీకి రూ.2.10కోట్లు, శ్రీదేవి క్యాటరర్స్కు రూ.1.40కోట్లు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీలో సరోజ క్యాటరర్స్కు రూ.1.50 కోట్లు, ప్రిజం హాస్పటాలిటీకి రూ.1.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇంకా పలువురు నిర్వాహకులకు మెస్ బిల్లులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఎప్పుడు చెల్లిస్తారో అంతుబట్టడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా మెస్ బిల్లులు చెల్లించాలని నిర్వాహకులు కోరుతున్నారు.