
చికిత్స పొందుతూ మహిళ మృతి
పాలకొల్లు సెంట్రల్: పెళ్లికి హైదరాబాద్ వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడి చికిత్స పొందుతున్న భార్య కుంపట్ల రీతు (41) శనివారం మృతి చెందింది. బంధధువులు తెలిపిన వివరాలు ప్రకారం కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం సంగమూడి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుంపట్ల రాంగోపాల్ (పెద్దరాజా) అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య రీతు, పాప ప్రణవి, కుమారుడు రాములను భీమవరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రీతును శుక్రవారం హైదరాబాద్ తరలించగా శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్యాభర్తల మృతితో బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
భీమవరం అర్బన్: భీమవరం రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపూసలమర్రు గ్రామానికి చెందిన పెమ్మాడి దయామణి (38) గల్ఫ్ నుంచి 20 రోజుల క్రితం సొంతూరు వచ్చింది. శనివారం మొగల్తూరు మండలంలోని కొత్తాటలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి సొంతూరు కొత్తపూసలమర్రుకు బంధువు ద్విచక్రవాహనంపై వస్తుండగా లోసరి పంచాయతీ గరవళ్ల దిబ్బ వద్ద వెనుకనుంచి లారీ ఢీకొనడంతో దయామణి మృతిచెందింది. ఆమె భర్త గతంలో మృతి చెందాడు. ఇద్దరు ఆడపిల్లలున్నారు.
కోడి వ్యర్థాల వాహనం సీజ్
దెందులూరు: జాతీయ రహదారి మీదుగా చేపల చెరువులకు చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న రవాణా వాహనాలను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. శనివారం ఉదయం తనిఖీల్లో భాగంగా చికెన్ వ్యర్థాలతో వెళుతున్న వ్యాన్ను పట్టుకున్నారు.హైదరాబాద్ నుంచి గుండుగోలను వైపు వెళ్తున్న వ్యానును దెందులూరు ఎస్సై శివాజీ తనిఖీ చేయగా.. తనిఖీ చేయగా కోళ్ల వ్యర్థాలు బయటపడ్డాయి. ఇద్దరిపై కేసు నమోదు చేశారు.