
ఎన్నికల శిక్షణకు జిల్లా అధికారులు
భీమవరం (ప్రకాశం చౌక్): భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన శిక్షణలో జిల్లా అధికారులు పాల్గొన్నార. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవెల్ సూపర్వైజర్లు, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులకు 12, 13 తేదీల్లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల తరఫున నరసాపురం ఆర్డీఓ దాసి రాజు, జిల్లా నుంచి ఐదు మంది బీఎల్ఓలు, ఇద్దరు బీఎల్ఓ సూపర్వైజర్లు హాజరయ్యారు. అలాగే శిక్షణ కార్యక్రమంలో కొన్ని అంశాలను బోధించడానికి కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి కూడా వెళ్లారు. శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు విధులు, విధానాలు, ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, యువ ఓటర్ల నమోదు, విధుల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.
దైవ దర్శనానికి వెళ్లి వచ్చేసరికి చోరీ
ఏలూరు టౌన్: ఏలూరు వన్టౌన్ ప్రాంతంలోని ఒక కుటుంబం దైవ దర్శనానికి వెళ్లి మొక్కు తీర్చుకుని వచ్చేసరికి దొంగలు ఇంటిని కొల్లగొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు వన్టౌన్ దక్షిణపువీధి ప్రాంతానికి చెందిన ఇన్నమూరి భాస్కరరావు ఇంటివద్దే కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. ఆయన తన కుటుంబంతో తిరుమల తిరుపతి దర్శనానికి ఆదివారం వెళ్లి శుక్రవారం ఇంటికి వచ్చారు. అయితే ఇంటి తలుపు తాళాలు పగలగొట్టి ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకుపోయినట్లు గుర్తించారు. చోరీ సమాచారం అందుకున్న ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ, క్లూస్ టీమ్ ఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.