
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ను 22 శాతానికి పెంచాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ) : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ను 22 శాతానికి పెంచాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు డిమాండ్ చేశారు. పట్టణంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 60 లక్షల మంది మాలలు ఉన్నారని తెలిపారు. మాలలకు 7.5 శాతం రిజర్వేషన్ సరికాదని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. హైకోర్టులో మాల సంఘాలు పిల్ వేయడం, కోర్టు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చెల్లదని తీర్పు రావడం ఖాయమన్నారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మాల సంఘాల జేఏసీ నాయకులు గంటా సుందర్ కుమార్, కేసీ రాజు, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
అద్యశ్యమైన యువకుడి హత్య..?
భీమవరం: భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని ఓ యువకుడు హత్యకు గురైనట్లు తెలిసింది. ఈనెల 4వ తేదీన కనిపించకుండా పోయిన యువకుడిని పట్టణానికి చెందిన ఒక కుటుంబం హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ ప్రాంతంలో విడిచినట్లు సమాచారం. యువకుడి కుటుంబ సభ్యులకు ఆకాశరామన్న ఉత్తరం ద్వారా హత్య జరిగినట్లు తెలియడంతో యువకుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా యువకుడిని హత్య చేసినట్లు ఆ కుటుంబం అంగీకరించినట్లు తెలిసింది. దీనితో జొన్నాడ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు గోనె సంచిలో ఉన్న మృత దేహాన్ని గుర్తించి హత్యకు కారణమైన వ్యక్తులను విచారిస్తున్నట్లు సమాచారం.
కన్నాయగూడెంలో చోరీ
కొయ్యలగూడెం : మండలంలోని పొంగుటూరు పంచాయతీ పరిధిలోని కన్నాయగూడెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. బాధితురాలు గద్దే రాణి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గద్దే రాణికి చెందిన పాత పెంకుటిల్లును రేకుల షెడ్డుగా మారుస్తున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న పూరి గుడిసెలో సామాన్లు పెట్టుకుని కుటుంబసభ్యులతో అక్కడే నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మెలకువ వచ్చి చూసినప్పుడు, పెట్టెను కోసి ఉండటాన్ని గుర్తించింది. వెంటనే పెట్టెను పరిశీలించగా, ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన రూ.5 లక్షల నగదు, 9 కాసుల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, చోరీపై ఆధారాలు సేకరిస్తున్నారు.